నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో కొట్టుకొచ్చిన మృతదేహాల నుంచి నగలు అపహరించిన ఇద్దరిని నేపాల్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.
భోటెకోశి నది ఉప్పొంగడంతో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. బురద, శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బాధితుల చెవులకు ఉన్న ఆభరణాలను తొలగిస్తున్న దృశ్యాలు వీడియోలో నమోదయ్యాయి.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీడియో ఆధారంగా మదన్ గురుంగ్ (25), ఉమేశ్ చౌదరి (38)లను గుర్తించి అరెస్టు చేసినట్లు సమాచారం. వరదల్లో మృతి చెందిన వారి వద్ద మిగిలిన విలువైన వస్తువుల కోసం శిథిలాలను వెతుకుతున్న సమయంలోనే వారు మృతదేహాల నుంచి నగలను అపహరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
తమవారిని కోల్పోయిన కుటుంబాలు విషాదంలో మునిగిపోయిన వేళ.. మృతుల పట్ల కనీస మానవత్వం లేకుండా నగలు దోచుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మృతదేహాలను సైతం వదలకుండా దోపిడీకి పాల్పడటం అత్యంత అమానవీయమంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు మండిపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates