దేశంలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రైవేటు వైద్యుల దోపిడీ వెరసి సామాన్య ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేని దీన స్థితి నెలకొంది. దీని ఫలితమే పశ్చిమ బెంగాల్ లో మాల్డా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిలో కేవలం 25 రోజుల్లో
60 మంది నవజాత శిశువులు మృతి చెందారు. అందులో ఒకే ఒక్కరోజు 10 మంది చెందడంతో ఏమి జరుగుతుందో అర్ధం కాక వైద్యులు సైతం ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడీ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది.
ఆగస్టు నెల ప్రారంభం నుంచి శిశువులు మరణించడం మొదలయ్యింది. వైద్యులు దీన్ని సహజ మరణాలుగా భావించారు. రెండో వారంలో ఒకే రోజు పది మంది పసి బిడ్డలు ప్రాణాలు పోవడంతో వైద్యాశాల అధికారులు, వైద్యులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. బెంగాల్ వైద్యారోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. ఎంఎంసీహెచ్ లో మరణించిన 60 మంది పిల్లల్లో 44 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ప్రయోజనం లేకుండా పోవడంతో మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి తరలించినట్లు నిర్దారించారు. ఒకేరోజు చనిపోయిన పిల్లల్లో 8మంది స్థానిక ప్రైవేటు ఆసుపత్రుల్లో జన్మించినట్లు తెలిసింది.
ఉత్తర బెంగాల్ ప్రజల వైద్యావసరాలను తీర్చేందుకు 2011లో ఎంఎంసీహెచ్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆసుపత్రిలో పారిశుధ్యలోపం మీద అనేక ఫిర్యాదులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రిలో ఎలుకల బెడద తీవ్రంగా వున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ శరద్వత్ ముఖర్జీ స్వయంగా ధృవీకరించడం గమనార్హం.
ప్రస్తుతం 60 మంది పిల్లల మరణానికి ఈ ఎలుకలకు ఏమైనా సంబంధం వుందా అనే విషయంపై అధికారులు రహస్య విచారణ చేస్తున్నట్లు వినికిడి. శ్వాస సంబంధ సమస్యలు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, కామెర్ల కారణంగా నవజాత శిశువులు మరణించినట్లు అధికారులు చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర స్వస్థ భవన్ అధికారులు కూడా ఆ వివరణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇటీవల కాలంలో మాల్డా పరిసర ప్రాంతాల్లో 20 కి పైగా ప్రైవేటు నర్సింగ్ హోంలు, ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ ఆసుపత్రుల్లో పెద్ద సంఖ్యలో కాన్పులు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పదవ తరగతి అర్హత కూడా లేని నర్సింగ్ సిబ్బందితో కాన్పులు చేయించడంతో తరచుగా సమస్యలు వస్తున్నట్లు ఆరోపణలు వున్నాయి. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కూడా లేవని ఫిర్యాదులు వస్తున్నాయి.
ఈ ఆసుపత్రుల్లో కాన్పులు జరిగిన తర్వాత సమస్యలు వచ్చిన నవజాత శిశువులను వైద్యులు సమీపంలోని ఎంఎంసీహెచ్ కు తరలించి చేతులు దులుపుకుంటున్నారని అధికారులు గుర్తించారు. 60 మంది మృతి చెందిన పసి బిడ్డల్లో అత్యధిక శాతం ఇలాంటి వైద్యాశాలల నుంచి వచ్చిన రెఫరల్ కేసులున్నట్లు నిర్ధారించిన విచారణాధికారులు మాల్డా ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రులను సీజ్ చేసినట్లు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates