టికెట్ రేట్లపై వారిదే తుది నిర్ణయం: హైకోర్టు

ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. టికెట్ల రేట్లను తగ్గిస్తూ ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో నంబర్ 35ను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేసింది. పాత పద్ధతిలోనే టికెట్ల అమ్మకాలు జ‌ర‌గాల‌ని ఆదేశించింది. దీంతో, సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.

ఈ క్రమంలో నేడు ఆ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాయింట్ క‌లెక్ట‌ర్ కు టికెట్ ధ‌ర‌ల ప్ర‌తిపాద‌న‌ల‌ను థియేట‌ర్ల య‌జ‌మానులు ముందుగా పంపించాలని ఆదేశించింది. సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై జాయింట్ క‌లెక్ట‌ర్ ఓ నిర్ణ‌యం తీసుకుంటార‌ని వెల్లడించింది.

అంతేకాకుండా, టికెట్ల ధ‌ర‌ల నిర్ణ‌యంపై ప్ర‌భుత్వం ఓ క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం త‌ర‌ఫున అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ వాద‌న‌లను వినిపించారు. అంతకుముందు, జీవో నం.35 కొట్టివేత సందర్భంగా హైకోర్టులో వాడీవేడి వాదనలు జరిగిన సంగతి తెలిసిందే.

కొత్త సినిమాల విడుదల సందర్భంగా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని, ఆ హక్కు థియేటర్ యాజమాన్యాలకు ఉంటుందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సినిమా టికెట్ ధరలపై తగ్గింపు విధించే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు. దీంతో, పాత పద్ధతిలోనే టికెట్ల రేట్లను నిర్ణయించుకునే అధికారాన్ని థియేటర్ల యజమానులకు హైకోర్టు సింగిల్ బెంచ్ కల్పించింది. ఇక, హైకోర్టు డివిజన్ బెంచ్ తాజా నిర్ణయంతో టికెట్ల రేట్ల పెంపు నిర్ణయం జేసీల చేతికి వెళ్లింది.