కరోనా సోకిన ఆ సెలబ్రెటీ ఇప్పుడెలా ఉంది?

కరోనాకు చిన్న పెద్ద.. రాజు పేద అనే తేడాలేమీ ఉండట్లేదు. అతి సామాన్యులనే కాదు.. ప్రముఖులనూ అది వదలట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కూడా కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్లోనూ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డాడు.

ఆయనతో పాటు ఫిలిం ఇండస్ట్రీ వర్గాల్లో బాగా పాపులర్ అయిన ప్రముఖ డిజైనర్, అక్కినేని నాగార్జున సహా పలు సినీ కుటుంబాలకు బాగా క్లోజ్ అయిన శిల్పా రెడ్డి సైతం కరోనా బారిన పడింది. ఆమె భర్త సైతం కరోనా బాధితుడిగా మారారు. ఐతే తన గురించి తెలిసిన వాళ్లందరూ భయపడ్డారట కానీ.. తాను మాత్రం కరోనా గురించి అసలేమాత్రం కంగారుపడలేదని ఆమె చెప్పింది.

కరోనా నుంచి 14 రోజుల్లోపే తాను కోలుకుని.. ఇప్పుడు ‘నెగెటివ్’ రిజల్ట్‌తో సంతోషంగా ఉన్నట్లు ఆమె వెల్లడించింది. తనకు కరోనా ఎలా సోకిందో.. ఆ తర్వాత అందరూ ఎలా భయపడ్డారో.. తాను ఎలా కరోనాను అధిగమించిందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది శిల్పా రెడ్డి.

‘‘కరోనా వైరస్‌ విషయంలో అర్థం లేని భయాలు, అపోహలున్నాయి. ‘కరోనా సోకితే ఇక అంతే…’ అని నమ్మేవాళ్లూ ఉన్నారు. నాకు కరోనా సోకిందని తెలిసిన వెంటనే నా దగ్గర పని చేసేవాళ్లు, ఫోన్‌ చేసి ఏడవడం మొదలుపెట్టారు. నేను కరోనాతో చనిపోతానని వారి భయం కావచ్చు. అంతగా చదువు లేని వాళ్లే కాదు.. కొందరు ఉన్నత విద్యావంతులు సైతం ఇదే అపోహతో ఉన్నారు.

కొన్ని రోజుల కిందట మా ఇంటికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో వాళ్లకు కొద్దిగా తలనొప్పి, జ్వరం లక్షణాలు కనిపించాయి. రెండు రోజుల తర్వాత వాళ్లకు ఫోన్‌ చేస్తే ఈ లక్షణాలు పెరిగాయన్నారు. తర్వాత పరీక్షలు చేయించుకుంటే కరోనా ఉన్నట్లు తేలింది. మమ్మల్నీ పరీక్షలు చేయించుకోమన్నారు. ఆ పరీక్షల్లో నాకు, మా వారికి కూడా కరోనా సోకినట్లు తేలింది. కరోనా సోకిన వ్యక్తుల ఆరోగ్యం క్షీణించే వేగం, వారి వారి శరీర ఫిట్‌నెస్‌, ఊపిరితిత్తుల సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది.

నా విషయంలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోగా, ఆరోగ్యం ఏమాత్రం క్షీణించలేదు. అందుకు కారణం నేను ఊపిరితిత్తులు బలపడే కార్డియో వ్యాస్క్యులర్‌ వ్యాయామాలు, ప్రాణాయామం చేయడమే. నేను కరోనా సోకాక అన్ని జాగ్రత్తలూ పాటిస్తూ వ్యాయామాన్ని కూడా కొనసాగించాను. 14 రోజుల పాటు హోం క్వారంటైన్లోనే ఉన్నాను. ఆ తర్వాత పరీక్షలు చేయించుకుంటే నాతో పాటు మా వారికి కూడా నెగెటివ్ వచ్చింది. కరోనా వల్ల ఏదో అయిపోతుందన్న భయం లేదు. మనం ఫిట్‌గా ఉండి జాగ్రత్తలు పాటిస్తే కరోనాను జయించవచ్చు’’ అని శిల్పా రెడ్డి చెప్పింది.