జగన్ సర్కారుకు పరీక్షగా మారనున్న భీమ్లానాయక్ రిలీజ్!

ఎవరైనా సరే.. తనకు నచ్చనంతనే పరీక్ష పెట్టే తత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారుది.  అలాంటిది భీమ్లానాయక్ అనే తెలుగు సినిమా అంత పెద్ద జగన్ సర్కారుకు పరీక్షగా మారనుందా? అంటే.. అవుననే చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి మొదట్లో దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తాజాగా చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కోసం విడుదలను వాయిదా వేసుకోవటం.. తాజాగా ఫిబ్రవరి 25న రిలీజ్ డేట్ ఇచ్చి.. ఇప్పుడు ఏప్రిల్ 1న విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నట్లుగా ప్రకటనలు రావటం తెలిసిందే.

తామెంతో ఆశగా ఎదురుచూస్తున్న సినిమా విడుదల అంతకంతకూ ఆలస్యం కావటంపై పవన్ అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. అయితే.. సినిమా విడుదల తేదీ విషయంలో నిర్మాతలు తాజాగా తీసుకున్న నిర్ణయం వెనుక పక్కా వ్యూహం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. పక్కా లెక్కలతోనే భీమ్లానాయక్ విడుదల విషయంలో వెనుకా ముందు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. పవన్ నటించిన వకీల్ సాబ్ చిత్ర విడుదల సమయంలో ఏపీ సర్కారుకు వ్యవహరించిన తీరు.. సినిమా వసూళ్ల మీద తీవ్ర ప్రభావం చూపిందన్న వాదన ఉంది.

ఇందుకు తగ్గట్లే బెనిఫిట్ షోలు… ప్రీమియర్లు.. అదనపు షోలకు అనుమతులు ఇవ్వని కారణంగా చిత్ర కలెక్షన్లను దెబ్బ తీశాయి. అనంతరం.. తెలుగు సినిమాపై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. పవన్ చేసిన వ్యాఖ్యలకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన వారు పెద్దగా స్పందించకపోవటం.. అనంతరం థియేటర్ టికెట్ల రేట్ల విషయంలో హీరో నాని చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీశాయో తెలిసిందే.

నాని చేసిన వ్యాఖ్యలకు తగ్గట్లే.. ఆయన తాజా మూవీ శ్యామ్ సింగ రాయ్ విడుదల చేసిన థియేటర్లలో తనిఖీలు చేపట్టటం.. చిన్నపాటి లోపాలు ఉన్నా ఆ వెంటనే నిక్కచ్చిగా వ్యవహరించిన అధికారుల తీరుతో చిత్ర వసూళ్ల మీద ప్రభావాన్ని చూపించింది. అదే సమయంలో టికెట్ల రేట్ల మీద స్పందించటానికి ఆసక్తి చూపని నాగార్జున తాజా చిత్రం బంగార్రాజు విడుదల కోసం నైట్ కర్ఫ్యూను వాయిదా వేస్తూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం చూసిన వారికి.. వడ్డించేవాడు మనోడైతే.. బంతి చివర్లో కూర్చున్నా అన్ని అందుతాయన్న సామెతను గుర్తుకు వచ్చేలా చేసింది.
వీటికి.. భీమ్లానాయక్ విడుదలకు లింకేమిటంటే.. అక్కడే ఉంది అసలు విషయమంతా.

కరోనా మూడో వేవ్ నేపథ్యంలో పలు పెద్ద సినిమాల విడుదల వాయిదా పడటం తెలిసిందే. మూడో వేవ్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టి మార్చి నాటికి పాత పరిస్థితులు నెలకొంటాయన్న అంచనా ఉంది. మార్చి.. ఏప్రిల్.. మే నెలల్లో ఇంతకాలం విడుదల కాని భారీ సినిమాలు వరుస పెట్టి రిలీజ్ కానున్నాయి. రాధేశ్యామ్.. ఆర్ఆర్ఆర్.. ఆచార్య.. సర్కారు వారి పాటతో పాటు మరిన్ని సినిమాలు విడుదల కానున్నాయి. దీంతో.. థియేటర్ టికెట్ల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ప్రస్తుతం ఉన్న రేట్లను యథాతథంగా అమలు చేస్తే.. ఖర్చులు రాకపోగా.. చివరకు కలెక్షన్ల మీదా తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

అందుకే.. ముందు రెండు మూడు పెద్ద సినిమాలు విడుదలైన తర్వాత.. భీమ్లా నాయక్ విడుదలైన పక్షంలో.. టికెట్ల రేట్లతో పాటు.. అదనపు షోలు.. ఫ్యాన్స్ షోలు లాంటి వాటి విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. ఈ కారణంగానే.. ముందుగా అనుకున్న తేదీ కంటే.. ఇతర హీరోల పెద్ద సినిమా విడుదలయ్యే వరకు ఆగి.. వారి విషయంలో ఏపీ సర్కారు అనుసరించిన విధానానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వ్యూహాన్ని చూసినప్పుడు.. మిగిలిన సినిమాల విషయంలో ఒకలా.. పవన్ మూవీ విషయంలో మరోలా వ్యవహరిస్తే.. జగన్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఒకవిధంగా భీమ్లానాయక్ మూవీ.. జగన్ సర్కారుకు లిట్మస్ పరీక్షలా మారిందన్న మాట వినిపిస్తోంది. ఏపీ సర్కారు ఏ తీరులో రియాక్టు అవుతుందో చూడాలి.