ఒక్క మల్టీఫ్లెక్సు.. రోజులో 35 షోలు.. బాలయ్యకే సాధ్యమైంది

సంక్రాంతి అన్నంతనే సినిమాల పెద్ద సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఈఏడాది సంక్రాంతికి అగ్ర హీరోలకు చెందిన రెండు సినిమాలతో పాటు.. కోలీవుడ్ కు చెందిన ఇద్దరు అగ్రహీరోలకు చెందిన సినిమాలు డబ్బింగ్ వెర్షన్లు విడుదల కావటం తెలిసిందే. మొత్తంగా ఐదు సినిమాలు విడుదల అవుతున్న వేళ.. తెలుగు ప్రజలకు ఈ సంక్రాంతి పండుగ సినిమాల విందుగా మారనుంది.

సాధారణంగా సినిమాలు ఏవైనా శుక్రవారం.. కాదంటే గురువారం విడుదల అవుతుంటాయి. పండుగ నేపథ్యంలో.. వరుస పెట్టి సినమాలు విడుదల కానున్న నేపథ్యంలో.. థియేటర్ల సమస్యతో పాటు.. మొదటి రోజు వచ్చే భారీ కలెక్షన్లకు గండి పడకుండా ఉండేందుకు వీలుగా ఒక్కో రోజు ఒక్కో పెద్ద సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేయటం తెలిసిందే.

ఈసారి సంక్రాంతి రేసులో మొదట విడుదలైన మూవీ ‘తెగింపు’. తమిళ అగ్రహీరో అజిత్ నటించిన ఈ చిత్రం జనవరి 11న అంటే బుధవారం విడులైంది. ఈ రోజున నందమూరి బాలక్రిష్ణ నటించిన వీర సింహారెడ్డి థియేటర్లలో సందడి చేస్తోంది. రేపు (గురువారం) మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విడుదల కానుంది. ఇక.. శుక్రవారం అంటే జనవరి 14న ఒకే రోజున తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన వారసుడు.. మరో చిన్న సినిమా కల్యాణం కమనీయం ఒకే రోజు విడుదల కానున్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. బాలక్రిష్ణ సినిమానే కాదు.. మరే అగ్రహీరో సినిమాకు లేని విధంగా ఒక అరుదైన రికార్డును బాలయ్య ఆరంభిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతున్న వీరసింహారెడ్డి.. వాల్తేరు వీరయ్య సినిమాకు మొదటి రోజున ఆరు షోలో వేసుకోవటానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వటం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు మల్టీ ఫ్లెక్సుల్లో ఉదయం 4.30 గంటల నుంచే షోలు మొదలయ్యాయి.

కుకట్ పల్లిలోని సుజనా ఫోరం మాల్ లో (ఇప్పుడు పేరు మారిందనుకోండి) మొత్తం తొమ్మిది స్క్రీన్లు ఉంటే.. అందులో ఎనిమిది స్క్రీన్లలో ఉదయం 4.30 గంటల నుంచి ప్రతి పదిహేనున నిమిషాల గ్యాప్ తో షోలో వేయటం షురూ చేశారు. దీంతో.. ఈ ఒక్కరోజులోనే 35 షోలో ఆ మల్టీ ఫ్లెక్సుల్లో పడనున్నాయి. ఇంత భారీగా ఒకే రోజు షోలో పడటం సంక్రాంతి వేళలో సాధ్యం కాలేదంటున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ విషయంలో మినహాయింపు తీసుకుంటే.. తెల్లవారుజామున 4.30 గంటలకు మొదలైన షోలు రాత్రి 11 గంటల వరకు నాన్ స్టాప్ గా సాగనున్నాయి. వాల్తేరు వీరయ్యకు కూడా ఉదయం 4.30 గంటల నుంచి షోలు మొదలు కానున్నట్లు చెబుతున్నారు.