ఏపీలో ఆ నియోజకవర్గాలు 100 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయం

కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ తో రాష్ట్రంలోని అన్నీ పార్టీలు హడలెత్తిపోతున్నాయి. ఎందుకంటే షెడ్యూల్ ప్రకటించిన రోజు నుండి పోలింగ్ జరిగే నాటికి 57 రోజుల వ్యవధి ఉంది. షెడ్యూల్ ప్రకటన నుండి పోలింగ్ రోజు వరకు ఎంత దూరముంటే పార్టీలు ప్రత్యేకించి అభ్యర్ధులకు అంత కష్టం, నష్టం. ఎన్నికల ప్రచారానికి వ్యవధి ఎంత తక్కువుంటే అభ్యర్ధులకు అంత మంచిది. ఎలాగంటే ఖర్చుల విషయంలోనే. షెడ్యూల్ కు పోలింగ్ కు మధ్య ఎంత వ్యవధి ఉంటే అభ్యర్ధులు చేయాల్సిన ఖర్చులు అంత పెరిగిపోతుంటాయి.

పోయిన ఎన్నికల్లో షెడ్యూల్-పోలింగ్ తేదీ మధ్య 27 రోజుల వ్యవధికే అభ్యర్ధులు చాలా కష్టపడ్డారు. అలాంటిది ఇపుడు 27 రోజుల వ్యవధికి అదనంగా 30 రోజులు ఎక్కువైంది. అందుకనే 57 రోజుల దూరాన్ని ఎలా నెట్టుకురావాలా అని పార్టీల అభ్యర్ధులు వణికిపోతున్నారు. ఎన్నికల కమీషన్ లెక్కల ప్రకారం ఎంఎల్ఏ అభ్యర్ధి రు. 38 లక్షలు, పార్లమెంటు అభ్యర్ధి రు. 90 లక్షలు ఖర్చులు చేయాలి. కాని వాస్తవానికి జరిగేది వేరని అందరికీ తెలుసు. అగ్రవర్ణాలు పోటీపడే కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇద్దరు అభ్యర్ధులకు చెరో రు. 100 కోట్లు ఖర్చవుతాయనటంలో సందేహంలేదు.

అలాగే గుంటూరు, విజయవాడ లాంటి పార్లమెంటు స్ధానాల్లో పోటీచేయబోయే ప్రధాన పార్టీల అభ్యర్ధులకు చెరో రు. 200 కోట్లు ఖర్చవుతుంది. అంటే ఎన్నికల కమీషన్ విధించిన రు. 90 లక్షలు, రు. 38 లక్షల నిబంధనలు ఎందుకైనా పనికొస్తాయా ? ఏ అభ్యర్ధి అయినా ఆచరిస్తారా ? గెలుపు టార్గెట్ గా పనిచేసే ఇద్దరు ఎంఎల్ఏ అభ్యర్ధులకు ఎన్నికల సమయంలో తక్కువలో తక్కువ రోజుకు మామూలుగా అయితే 2, 3 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది.

అలాంటిది ఇపుడున్న 57 రోజుల వ్యవధిని ఎలా తట్టుకోవాలా అన్నది అర్ధంకాక పార్టీల అభ్యర్ధులు తలలు పట్టుకుంటున్నారు. ఖర్చులు తడిసిమోపడవ్వటం ఒక ఎత్తయితే మండిపోతున్న ఎండలు మరోఎత్తు. మామూలుకన్నా ప్రస్తుత వేసవిలో ఎండలు మరింతగా మండిపోతున్నాయి. ఇప్పటి ఎండలనే జనాలు తట్టుకోలేకపోతున్నారంటే ఏప్రిల్, మే ఎండలను తలచుకుంటేనే అభ్యర్ధులు భయపడిపోతున్నారు.