రేవంత్ దావోస్ ట్రిప్ లో భారీ ఒప్పందాలు

పెద్దగా అంచనాలు లేకపోవటం ఒక్కోసారి కలిసి వస్తుంది. హైప్ అధికంగా ఉన్నప్పుడు ఫెర్ ఫార్మారెన్స్ ఎంత ఉన్నప్పటికీ ఫలితం పెద్దగా ఉండదు. అందుకు భిన్నంగా లొప్రొఫైల్ తో ఉన్న వేళ.. కొద్దిపాటి ఫలితాలు సైతం భారీ పేరు ప్రఖ్యాతులకు కారణమవుతాయి. ఈ లెక్కన చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అదరగొట్టేశారని చెప్పాలి. గడిచిన పదేళ్ల కాలంలో తెలంగాణకు ముఖంగా మారిన కేటీఆర్.. ప్రతి ఏడాది దావోస్ కు వెళ్లటం.. భారీగా డీల్స్ చేసుకోవటం.. బ్రాండ్ హైదరాబాద్ ను భారీగా ప్రమోట్ చేసిన పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు.

తెలంగాణలో రేవంత్ సర్కారు ఏర్పాటైన వేళ.. మాజీ మంత్రి కేటీఆర్ మాదిరి మేజిక్ చేసే సత్తా ఉందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. దావోస్ కు వెళ్లిన వేళ.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెద్దగా అంచనాలు లేవని చెప్పాలి. ఇదే సీఎం రేవంత్ కు ఇప్పుడు కలిచి వచ్చేలా చేసింది. తన దావోస్ పర్యటనలో భాగంగా భారీగా ఒప్పందాలు చేసుకోవటంలో రేవంత్ తన సత్తా చాటారని చెప్పాలి. మొత్తం రూ.37,870 కోట్ల మేర డీల్స్ జరిగాయి.

ఇందులో రూ.12,400 కోట్లతో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో కార్యకలాపాలకు ఓకే చెప్పేసింది. స్కిల్ వర్సిటీ.. ఎనర్జీ ప్రాజెక్టుల మీద అదానీ ఆసక్తి చూపింది. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు జేఎస్ డబ్ల్యూ నియో ఎనర్జీ ముందుకు రాగా.. గోడి ఇండియా సంస్థ ఆధ్వర్యంలో బ్యాటరీ సెల్ తయారీ యూనిట్ ఒప్పందం జరిగింది. డేటా సెంటర్లను విస్తరిస్సతామన్న ప్రతిపాదనతో వెబ్ వెర్క్స్ సంస్థ ముందుకు రావటం లాంటి సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా దావోస్ టూర్ లో సీఎం రేవంత్ అదరగొట్టేశారని చెప్పాలి.

సంస్థ                            పెట్టుబడులు (రూ.కోట్లల్లో)
అదానీ గ్రూప్                           12,400
జేఎస్ డబ్ల్యూ నియో ఎనర్జీ         9,000
గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్   8,000
వెబ్ వెర్క్స్                               5,200
ఆరాజెన్ లైఫ్ సైన్సెస్                    2,000
గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్           1,270