వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పార్టీలో ఇప్పుడు పట్టు తగ్గినా ఇప్పటికీ సాయిరెడ్డి సాయిరెడ్డేనంటారు. తన ప్రత్యర్థులు, జగన్ ప్రత్యర్థులపై ఆయన విరుచుకుపడే తీరు, చేసే ట్వీట్లు తరచూ చర్చలో ఉంటాయి. ముఖ్యంగా ఆయన ట్వీట్లలో వాడే భాష, అడ్డగోలు ఆరోపణల గురించి జనం మాట్లాడుకుంటుంటారు.
ఆయన్ను గుడ్డిగా అభిమానించే ఆయన టైప్ బ్యాచంతా ఆ ట్వీట్లు చూసి సంబరాలు చేసుకుంటే.. ఆ భాష నచ్చనివారు మాత్రం పెద్దల సభ సభ్యుడై ఉండి ఇదేం పద్దతని విమర్శిస్తుంటారు. ఇదంతా ఎలా ఉన్నా కొద్దిరోజులుగా సాయిరెడ్డి భాషలో చాలా మార్పు వచ్చింది. బూతులు తగ్గి మర్యాదకరమైన పదాలు వచ్చి చేరుతున్నాయి. విమర్శలు పదునుగానే ఉంటున్నా భాష మృదువుగా ఉంటోంది. సాయిరెడ్డి తీరులోనే మార్పు వచ్చిందా లేదంటే ట్వీట్లు చేసే టీం మారిందా అన్నది తెలియాల్సి ఉంది.
తాజాగా ఆయన ఓ ట్వీట్ చేశారు. అందులో ఆయన ‘విపక్ష టీడీపీ నాయకులకు పల్లకీ మోయని వారందర్నీ శత్రువులుగా చూస్తే ఐదు కోట్ల ఆంధ్రులు మీకు శత్రువులే అవుతారు. రాష్ట్రంలో మీకు మిత్రులే లేకుండాపోతారు మహాశయా!’ అని రాశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఉద్దేశించి చేసినట్లుగా అనిపిస్తున్న ఈ ట్వీట్లో ఆయన రాజకీయ విమర్శ చేసినప్పటికీ మర్యాదకరమైన భాషే వాడారు. గతంలో ఆయన పవన్నుద్దేశించి ట్వీట్ చేస్తే దత్తపుత్రుడు, ముగ్గురు భార్యలు, పావలా కల్యాణ్ వంటి మాటలుండేవి. ఈసారి చాలా సాఫ్ట్గా విమర్శించారు విజయసాయిరెడ్డి.
అంతెందుకు దీనికంటే ముందు.. మొన్న టీడీపీ నేతలు నిర్వహించిన ఓ సభలో వేదిక కూలి నాయకులు ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆ వీడియో వైరల్ అయింది. అలాంటిది దొరికితే గతంలో సాయిరెడ్డి చెలరేగిపోయేవారు. శని, దరిద్రం, చావు.. ఇలా అన్ని పదాలూ వాడేసేవారు. ఈసారి మాత్రం వచ్చే ఎన్నికలలో గెలుపోటములకు ముడిపెడుతూనే చాలా పద్దతిగా దానిపై ట్వీట్ చేశారు. పైగా అందులో మొదటి మాటలోనే ఆ దుర్ఘటనపై తన బాధను వ్యక్తంచేశారు విజయసాయిరెడ్డి. ‘‘స్టేజ్ (వేదిక) కూలడం బాధాకరం. వరుస అపశృతులు 2024 ఎన్నికల్లో విపక్షాల పతనానికి సంకేతాలా?’’ అంటూ ఆ వీడియోను షేర్ చేశారు సాయిరెడ్డి.
ఇంకో ట్వీట్లో ‘‘ప్రభుత్వ పనితీరులో లోపాలున్నా, అవతవకలు జరిగినట్టు ఆధారాలున్నా విపక్ష నేతలు వెలికి తీయొచ్చు. సద్విమర్శలను ఆహ్వానిస్తాం. అవేమీ దొరక్కపోతే మంచి పనులు ఏం చేయగలరో నమ్మశక్యంగా ప్రజలకు చెప్పొచ్చు. అంతేగానీ గంటకో మాట, గడియకో విమర్శ చేస్తూ తమ అజ్ఞానం, మూర్ఖత్వాన్ని బహిర్గతం చేసుకోవడం రాజకీయం అనిపించుకోదు’’ అంటూ విపక్షాలకు చాలా పద్దతిగా హితవు పలికారు.
వారం కిందట ఓ ట్వీట్లో చంద్రబాబుపై ‘‘నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడు ఈసారి సొంత నియోజకవర్గంలో గెలుపు కోసం ఆపసోపాలు పడుతూ అలవికాని హామీలు ఇస్తున్నారు. తాను గెలిస్తే చాలు అనుకుంటున్నారు. ఇక అయన పార్టీ గురించి చెప్పేదేముంది!’’ అంటూ ట్వీట్ చేశారు. గతంలో చంద్రబాబుపై ట్వీట్ చేస్తే బొల్లి, ముసలి అనే మాటలుండేవి. కానీ… ఇప్పుడు మాత్రం రాజకీయ విధానాలనే తప్పు పట్టారు కానీ వ్యక్తిగత విమర్శ, హేళన, బాడీ షేమింగ్ చేయలేదు.
కొద్దిరోజులుగా సాయిరెడ్డి చేస్తున్న ఇలాంటి సాఫ్ట్ ట్వీట్లు చూస్తున్నవారు సాయిరెడ్డి మారిపోయారని.. పార్టీలో ఆయనకు ప్రాధాన్యం తగ్గడంతో తత్వం బోధపడి నోరు మంచి అయితే ఊరు మంచిదవుతుందన్న సత్యం ఆయనకు బోధపడినట్లుగా ఉందని అంటున్నారు.
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…