ప్రతిపక్షంలో ఉండగా.. అధికార పార్టీ మీద నిందలు మోపడం.. ప్రతి విషయాన్నీ రాజకీయంగా మార్చడం.. బాగానే ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చాక కూడా అదే ఒరవడిని కొనసాగిస్తే చూసే జనాల్లోకి వేరే సంకేతాలు వెళ్తాయి. అధికారంలో ఉన్న వాళ్లు ఏం సాధించారా అని చూస్తారే తప్ప.. నిత్యం ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ వాళ్లను ఏడిపించుకు తింటుంటే.. వాళ్లను ఇబ్బంది పెడుతుంటే.. వారి మీద బురదజల్లుతుంటే.. సున్నితమైన విషయాల మీద వివాదాలు రాజేస్తుంటే జనాలకు అధికార పార్టీ మీద వ్యతిరేక అభిప్రాయం ఏర్పడుతుందే తప్ప ప్రయోజనం అంటూ ఏదీ ఉండదు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, దాని మద్దతుదారులు ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా ఎటాకింగ్ మోడ్లోనే సాగిపోతున్నారు. సున్నితమైన విషయాల మీద కూడా దారుణమైన వ్యాఖ్యలతో జనాలకు వెగటు పుట్టిస్తున్నారు.
తారకరత్న మరణం మీద తాజాగా వైసీపీ చేస్తున్న రాజకీయం జనాలకు విస్మయం కలిగిస్తోంది. తారకరత్న గుండెపోటు వచ్చిన తొలి రోజే చనిపోయాడని.. కానీ లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన తొలి రోజే ఇలా జరిగితే అపశకునం అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆపి శివరాత్రి రోజు విషయం ప్రకటించారని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఆ పార్టీకి వీర విధేయురాలిగా మారిన లక్ష్మీపార్వతి చేసిన ఈ ఆరోపణల పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు మీద ఉన్న ద్వేషంతోనో, జగన్ మెప్పు పొందాలనో లక్ష్మీ పార్వతి ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ వీడియో పెట్టి ప్రమోట్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సాక్షి మీడియాలో కూడా ఇవే ఆరోపణలతో వార్తలు రావడం గమనార్హం.
వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో లక్ష్మీ పార్వతి వీడియోను తిప్పడం.. ఇవే ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసం? తన ప్రయోజనాల కోసం తారకరత్నను బలి తీసుకున్నాడంటూ నారా లోకేష్ను ఈ వర్గం తిట్టిపోస్తోంది. కానీ తారకరత్న రావడం వల్ల లోకేష్కు ఏమైనా ప్రత్యేక ప్రయోజనం ఉందా అన్నది ఇక్కడ ప్రశ్న. తారకరత్న స్టార్ హీరో కాదు. రాజకీయంగా కూడా ఇప్పుడే తొలి అడుగులు వేస్తున్నాడు. అతను రావడం వల్ల లోకేష్కు లాభం చేకూరుతుందని చెప్పలేం. నిజానికి తారకరత్నే రాజకీయాల్లో కెరీర్ కోసం చూస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు. అందుకే పాదయాత్రలో పాల్గొని రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలనుకున్నాడు. అలాంటపుడు లోకేష్, బాబు తమ ప్రయోజనం కోసం తారకరత్నను వాడుకున్నారని ఎలా అనగలరు?
తారకరత్న దురదృష్టం కొద్దీ గుండెపోటుకు గురయ్యాడు. పాపం మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలాడు. చికిత్స పొందుతున్న తారకరత్నను ఆసుపత్రిలో చూసిన అనంతరం.. వైద్యానికి ఆయన శరీరం సహకరిస్తోందని.. వైద్యులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని ఆయన దగ్గరి బంధువు, వైసీపీ అగ్రనేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డే స్వయంగా ప్రకటించారు. నిజంగా తారకరత్న చనిపోయి.. లోకేష్కు చెడ్డపేరు రావొద్దని ఆ విషయం దాచి పెడితే సాయిరెడ్డికి తెలియకుండా ఉంటుందా? ఆ విషయం తెలిస్తే ఆయన నానా యాగీ చేయకుండా వదిలే రకమా? మరి లక్ష్మీపార్వతి చేస్తున్న ఆరోపణలకు విలువ ఎక్కడిది? సున్నితమైన ఇలాంటి విషయాల్లో రాజకీయం చేస్తే అది అవతలి వర్గానికే సానుభూతిని తెచ్చి పెట్టి… వైసీపీకి చేటు చేస్తుందే తప్ప ప్రయోజనం మాత్రం కలగజేయదని ఆ పార్టీ నేతలు అర్థం చేసుకుంటే మంచిది.
This post was last modified on February 20, 2023 11:54 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…