అన్నా రాజ‌కీయం యూట‌ర్న్‌.. ఏం జ‌రిగింది…?

అన్నా రాంబాబు. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడే అగ్ర‌వ‌ర్ణ నేత కూడా! అయితే.. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న మంచి వాడే అయినా.. నోరు కుద‌ర‌ద‌నే టాక్ ఉంది. ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడేయ‌డం..వివాదాల్లోకి త‌న‌ను తానే నెట్టేసుకోవ‌డం.. అన్నాకు వెన్న‌తో పెట్టిన విద్య. అందుకే ఆయ‌న ఏ పార్టీలోనూ ఇమ‌డ‌లేక పోతున్నారు.

గ‌తంలో టీడీపీ, ప్ర‌జారాజ్యం పార్టీల్లోనూ చ‌క్రం తిప్పారు. కానీ, ప‌ట్టుమ‌ని ప‌ది మంది సొంత‌కే డ‌ర్‌ను ఆయన వెంట నిలుపుకోలేక పోయారు. ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి నెల‌కొందని స్థానిక రాజ‌కీయ నేత‌లు చెబుతున్నారు. వైసీపీలో ఉన్న అన్నా.. ఆ పార్టీ నేత‌ల‌కు అవ‌కాశం ఇవ్వరు. ఎవ‌రినీ త‌న ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌రు. స్థానిక వైసీపీ సీనియ‌ర్ల‌తోనూ ఆయ‌న‌కు స‌ఖ్య‌త‌లేదు. మంత్రి ప‌దవిని ఆశించారు. అయితే..జ‌గ‌న్ ఆయ‌నను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు.

ఈ నేప‌థ్యంలోనే వైసీపీకి అన్నా అయిన వాడే అయినా.. అంద‌రూ కానివాడిగానే మారిపోయారు. ఇక‌, వచ్చే ఎన్నిక‌ల్లో గిద్ద‌లూరు నుంచి మ‌రో నాయ‌కుడిని రంగంలోకి దింపాల‌ని చూస్తున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ బాధ్య‌త‌ను ప్ర‌కాశం జిల్లాకుచెందిన సీనియ‌ర్ నాయ‌కుడు.. మాజీ మంత్రికి అప్ప‌గించార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఈ విష‌యం తెలిసిన అన్నా.. వైసీపీని బ్ర‌తిమాలేదిలేదు.. నా దారి నేను చూసుకుంటాన‌ని చెబుతున్న‌ట్టు ప్ర‌చారంలో ఉంది.

కానీ, ఇప్పుడు అన్నా గురించి తెలిసిన టీడీపీ ద‌రిచేర‌నిచ్చే ప‌రిస్థితి అయితే క‌నిపించ‌డం లేదు. దీంతో జ‌న‌సేన‌లోకి వెళ్లాల‌ని అన్నా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం. గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీలోనూ ఆయ‌న ప‌నిచేసిన నేప‌థ్యంలో ఆ ప‌రిచయాల‌ను వినియోగించుకుని ఆయ‌న ట్రై చేస్తున్నార‌ని.. టికెట్ ఇస్తే.. గెలిచి చూపిస్తాన‌ని కూడా ఆయ‌న సంకేతాలు పంపుతున్న‌ట్టు అన్నావ‌ర్గం చెబుతోంది. మ‌రి జ‌న‌సేన అధినేత ఇలాంటి ఫైర్ బ్రాండ్‌ను రానిస్తారో లేదో చూడాలి.