Political News

ఎవరిది రౌడీయిజం? ఎవరిది అరాచకం?

కుప్పంలో ఎలాగైనా చంద్రబాబును ఓడించాలనేది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టుదల.. అది సాధ్యమయ్యే సూచనలు లేకపోవడంతో ఇప్పుడు ఏకంగా కుప్పంలో చంద్రబాబు పర్యటననూ అడ్డుకున్నారంటున్నారు టీడీపీ నేతలు.

కుప్పంలో బుధవారం చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రెండో రోజూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పోటాపోటీగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబులు మీడియా సమావేశాలు పెట్టి విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డి చంద్రబాబు రౌడీయిజం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేయగా… వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని చంద్రబాబు మండిపడ్డారు.

కుప్పంలో చంద్రబాబు రౌడీయిజం చేశారని, పోలీసులపైకి తన కార్యకర్తలను ఉసిగొల్పారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. పోలీస్‌ యాక్ట్‌ 30 అమలులో ఉన్న చోట అనుమతి లేకుండా సభ ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను చంద్రబాబు తిరస్కరించారని.. ఆయనకు చట్టాలపై గౌరవం లేదని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఇరుకు రోడ్లపై సభలతో 11 మంది ప్రాణాలు బలిగొన్నారని.. గతంలో పుష్కరాల సమయంలో 29 మందిని బలితీసుకున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు.

కుప్పంలోనూ చంద్రబాబు ప్రతిష్ట దిగజారిపోవడంతో.. పోయిన ప్రతిష్ఠ తిరిగి సంపాదించుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని పెద్దిరెడ్డి అన్నారు. అందుకోసం చంద్రబాబు రౌడీయిజాన్ని నమ్ముకున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు.

‘పోలీసుల అనుమతితో నిర్వహించుకునే సభకు ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ రౌడీలా వ్యవహరిస్తే కుప్పంలో తిరిగి ప్రాచుర్యం పొందవచ్చన్న చంద్రబాబు దిగజారుడు తీరు చూస్తుంటే జుగుప్స కలుగుతోంది. రాజకీయ విలువను దిగజార్చేలా చంద్రబాబు వ్యవహరించారు. గతంలో కూడా ఇదే కుప్పంలో ఆయన తన అనుయాయులను రెచ్చగొట్టి కర్రలు, హాకీస్టిక్స్, రాళ్ళతో వైయస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేసి భయోత్పాతం సృష్టించారు. అవి ఆయనకు అలవాటుగా మారాయి. అందుకే ఇవాళ కూడా అదే విధంగా పోలీసులపైనే దాడికి ఉసిగొల్పాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయకుడి రూపంలో ఉన్న రాక్షసుడిగా మారాడు’ అంటూ పెద్దిరెడ్డి ఆరోపించారు.

మరోవైపు చంద్రబాబు కూడా వైసీపీ నేతలకు ధీటుగా బదులిచ్చారు. కుప్పంలో బుధవారం జరిగింది ప్రపంచంలోని తెలుగువారంతా చూశారన్న ఆయన గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి, షర్మిల, విజయమ్మ, జగన్‌లు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాదయాత్రలు చేసుకున్న విషయం గుర్తుచేశారు.

వైఎస్ కుటుంబానికి చెందిన నలుగురూ తాను సీఎంగా ఉన్నప్పుడే పాదయాత్రలు చేశారని.. వారిలో ఏ ఒక్కరికీ ఆటంకాలు కలిగించలేదని.. అలాంటిది ఇప్పుడు తాను సొంత నియోజకవర్గం కుప్పంలో సొంత వారిని కలుసుకునేందుకు వీలు లేకుండా చేశారని ఆయన మండిపడ్డారు. జగన్ ఓటమి భయంతో తప్పుడు కేసులు పెడుతున్నారని.. ఎస్పీ శాంతి భద్రత లను కాపాడటానికి ఉన్నారా, టిడిపి కార్యకర్తలపై దాడులు చేయించేందుకు ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. తనను ప్రజలలో తిరగకుండా చేయాలన్నదే వైసీపీ లక్ష్యమని చంద్రబాబు ఆరోపించారు.

కాగా ముందుముందు లోకేశ్, పవన్ యాత్రలు ఉన్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ విధిస్తున్న ఆంక్షలు, బుధవారం కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న పోలీసుల తీరును ఏపీలోని మిగతా రాజకీయపార్టీల నేతలూ తప్పు పడుతున్నారు. వామపక్షాలు, బీజేపీ, జనసేన నేతలు పోలీసుల, ప్రభుత్వం తీరును తప్పుపట్టారు.

This post was last modified on January 5, 2023 2:35 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సుహాస్ లెక్క తప్పుతోంది ఇక్కడే

కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…

13 mins ago

ఇటు సత్యదేవ్ అటు రోహిత్ మధ్యలో కోతులు

మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి…

1 hour ago

ఏపీలో వేవ్ మొదలైనట్లేనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…

2 hours ago

నిఖిల్ క్రేజీ మూవీ ఏమైనట్టు

రెగ్యులర్ కథల జోలికి వెళ్లకుండా డిఫరెంట్ గా ప్రయత్నిస్తూ కార్తికేయ 2తో పెద్ద బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న యూత్…

2 hours ago

ప్ర‌చారంలో దుమ్మురేపుతున్న భ‌ర్త‌లు!

రాజ‌కీయాలు మారాయి. ఒక‌ప్పుడు భ‌ర్త‌లు ఎన్నిక‌ల రంగంలో ఉంటే.. భార్య‌లు ఉడ‌తా భ‌క్తిగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చూసుకునే వారు. అది…

3 hours ago

థియేటర్ల నిస్తేజం – బాక్సాఫీసుకు నీరసం

ఎదురుచూసేకొద్దీ బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చే సినిమాలు రావడం అంతకంతా ఆలస్యమవుతూనే ఉంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. తెగుతున్న సింగల్ డిజిట్…

4 hours ago