నో విలీనం..మిత్రపక్షమంతే

జాతీయపార్టీ బీఆర్ఎస్ లో విలీనం విషయంలో జేడీఎస్ అగ్రనేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టమైన వివరణ ఇచ్చేశారు. తమ పార్టీ బీఆర్ఎస్ లో విలీనం అవుతుందనే ప్రచారాన్ని కొట్టేశారు. తమ రెండుపార్టీలు మిత్రపక్షాలేనని స్పష్టంగా చెప్పారు. కర్నాటక అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రెండుపార్టీలు కలిసి పోటీచేయబోతున్నట్లు కుమారస్వామి చెప్పారు. 2023లో జరగబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లోను తర్వాత 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లోను రెండుపార్టీలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే ముందుకు సాగుతాయన్నారు.

ఇప్పటివరకు తొందరలోనే బీఆర్ఎస్ లో జేడీఎస్ విలీనమైపోతుందనే ప్రచారానికి కుమారస్వామి తెరదించేశారు. మాజీ సీఎం చేసిన ప్రకటన కారణంగా కర్నాటకలో స్ధిరపడ్డ తెలుగువాళ్ళుండే ప్రాంతాలపైనే బీఆర్ఎస్ ఎక్కువగా దృష్టిపెట్టినట్లు అర్ధమవుతోంది. బెంగుళూరు సిటీ, తుముకూరు, మైసూరు, హోస్పేట ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు జేడీఎస్ కొన్ని సీట్లను కేటాయించే అవకాశముంది.

ఎలాగూ కర్నాటకలో ఎప్పటినుండో తెలుగు సంఘాలు యాక్టివ్ గానే పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ సంఘాల్లోని ముఖ్యుల ద్వారా పార్టీ విస్తరణకు బీఆర్ఎస్ చర్యలు తీసుకునే అవకాశముందని ప్రచారం మొదలైంది. మరి తన సొంతంగా విస్తరించేందుకు బీఆర్ఎస్ చర్యలు తీసుకుంటే జేడీఎస్ అంగీకరిస్తుందా ? అన్నదే పెద్ద పాయింట్. ఎందుకంటే ఏ పార్టీ కూడా తనంతట తానుగా ప్రత్యర్ధులను తయారుచేసుకోదు. ఓట్లు, సీట్లను ఇతర పార్టీలతో షేర్ చేసుకోవాలని అనుకోదు. ఇప్పటికే ప్రజల్లో నాటుకుపోయున్న పార్టీలతో షేర్ చేసుకోవటానికి మాత్రం ఎలాంటి అభ్యంతరాలుండదు.

కొత్తపార్టీని నెత్తిన పెట్టుకుని తనకు వస్తాయని అనుకునే ఓట్లు, సీట్లలో షేర్ ఇవ్వటమంటే కష్టమే. ప్రస్తుతం బీఆర్ఎస్-జేడీఎస్ వ్యవహారం ఎలాగ సాగుతుందనేది ఆసక్తిగా మారింది. స్ధానిక ఎన్నికలు లేదా అసెంబ్లీ ఎన్నికలో జరిగితే కానీ రెండుపార్టీల మైత్రి ఎంత బలంగా ఉందనే విషయంపై క్లారిటిరాదు. నిధులు, ప్రచారం, టికెట్ల ఫైనల్ చేయటం లాంటి అంశాలే కీలకపాత్ర పోషిస్తాయి. మరి రెండుపార్టీల మధ్య అవగాహన ఎంతుందో చూడాల్సిందే.