Political News

బీజేపీది కేన్స‌ర్ త‌ర‌హా రాజ‌కీయం: కేసీఆర్‌

బీజేపీపై టీఆర్ ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బీజేపీది కేన్స‌ర్ త‌ర‌హా రాజ‌కీయ‌మ‌ని విమ‌ర్శించారు. అన్ని మతాలు, కులాలను ఆదరించే దేశం మనదని.. కొందరు మాత్రం కులం, మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ దుయ్య‌బ‌ట్టారు. అది క్యాన్సర్‌ జబ్బులాంటిదని.. ఒకసారి వస్తే చాలా ప్రమాదకరమని చెప్పారు. అన్ని కులాలు, మతాలను ఆదరించే పరిస్థితిని చెడగొడితే ఎటూ కాకుండా పోతామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ పరిధిలో మూడు టిమ్స్‌ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్‌ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్వాల్‌లో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు.

మిగతా పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సభలు జరుపుతున్నాయన్న సీఎం… త‌మ ప్ర‌భుత్వం, పార్టీ మాత్రం ఆరోగ్యానికి సంబంధించిన సభ పెట్టుకున్నామని.. ఇదే వాళ్లకీ మనకీ తేడా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైద్యవిధానాన్ని పటిష్ఠం చేస్తున్నామని సీఎం ఉద్ఘాటించారు. దీనిలో భాగంగానే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. టిమ్స్‌ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందుతుందన్న సీఎం… 16 స్పెషాలిటీ, 15 సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

“అల్వాల్‌ టిమ్స్‌లో ప్రసూతి సేవల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. కరోనాలాంటి వైరస్‌లు భవిష్యత్‌లోనూ వచ్చే ప్రమాదముంది. హైదరాబాద్‌ నగరంపై ఒత్తిడి పెరుగుతున్నందున ఎయిమ్స్‌ తరహాలో టిమ్స్‌ ఆస్పత్రులను తీసుకొస్తున్నాం. కేవలం గాంధీ, ఉస్మానియా, నీలోఫర్‌పైనే ఆధారపడకుండా నగరానికి నలువైపులా వీటిని ఏర్పాటు చేస్తున్నాం.“ అని వ్యాఖ్యానించారు.

కులమతాల పేరుతో రాజకీయాలు చేసే వారిని ప్రజలు గమనించాలని సీఎం కేసీఆర్ సూచించారు. మన దేశానికి చెందిన సుమారు 13 కోట్ల మంది విదేశాల్లో పనిచేస్తున్నారని… అక్కడి ప్రభుత్వాలు వాళ్లని వెనక్కి పంపితే వారికి ఉద్యోగాలు ఎవరివ్వాలని ప్రశ్నించారు. ఈ ఏడేళ్లలో హైదరాబాద్‌లో 2.30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు స్పష్టం చేశారు. 10 నుంచి 15లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలిగాయని వివరించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో 14వేల ఎకరాల్లో ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.

ప్రపంచానికే వ్యాక్సిన్ల రాజధానిగా హైదరాబాద్‌ ఉందన్నారు. జీనోమ్‌ వ్యాలీలో వ్యాక్సిన్‌ సంస్థలు ఉన్నాయన్నారు. దేశవిదేశాల వాళ్లు ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో ప్రశాంతమైన వాతావరణం లేకపోతే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా? అని ప్ర‌శ్నించారు. “మతం, కులం పేరుతో కొట్లాటలు, కర్ఫ్యూలు ఉంటే పెట్టుబడులకు ఎవరూ ముందుకు రారు. అలాంటి క్యాన్సర్‌ మన దగ్గర తెచ్చుకోవద్దు. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. తాత్కాలికంగా అవి గమ్మత్తుగా అనిపించినా శాశ్వత ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి ఆస్కారం ఇవ్వొద్దు.“ అని పిలుపునిచ్చారు.

మనది పసికూన రాష్ట్రమైనా అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని కేసీఆర్ అన్నారు. గుజరాత్‌, మహారాష్ట్ర తదితర పెద్ద రాష్ట్రాల కంటే మన తలసరి ఆదాయం ఎక్కువన్న సీఎం… తెలంగాణ తరహా పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవని వెల్లడించారు. ఇండియాలో కరెంట్ ఉంటే వార్త.. తెలంగాణలో కరెంట్‌ పోతే వార్త అని అన్నారు. గుజరాత్‌లో రైతులు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తున్నారన్న సీఎం… రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని పేర్కొన్నారు. మిషన్‌ భగీరథతో మంచినీటి కొరత తీర్చుకున్నామని తెలిపారు.

“సాగునీటి రంగంలో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం. వైద్యం, విద్యపై రాబోయే రోజుల్లో దృష్టి పెట్టబోతున్నాం. ప్రజల మద్దతుతోనే ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజల దీవెన ఇదేవిధంగా కొనసాగాలి.. తెలంగాణ మరింత పచ్చబడాలి. దుష్టశక్తుల బారి నుంచి ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని ముందుకెళ్తాం“ అని సీఎం వ్యాఖ్యానించారు.

This post was last modified on April 27, 2022 10:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago