భారత్ తో చర్చలు జరపనంటోన్న నేపాల్

Nepal

కొంతకాలంగా భారత్ పై చైనా కయ్యానికి కాలు దువ్వుతోన్న సంగతి తెలిసిందే. లడఖ్ ప్రాంతంలో భారత సైన్యంపై చైనా బలగాలు….కవ్వింపులకు పాల్పడుతున్నాయి. డ్రాగన్ సేనలకు భారత్ దీటుగా జవాబిస్తోంది. బలగాల ఉప సంహరణకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే చైనా బలగాలు దుందుడుకు చర్యలకు పాల్పడడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

తూర్పు లడాఖ్ లోని గల్వాన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో భారత్ కు చెందిన కల్నల్ సంతోష్ సహా 20 మంది సైనికులు వీరమరణం పొందగా, చైనాకు చెందిన 46 మంది సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఓ పక్క డ్రాగన్ తో ఇండో-చైనా బోర్డర్ వద్ద ఉద్రిక్తత చల్లారక ముందే మరోవైపు పొరుగు దేశం నేపాల్ నుంచి భారత్ కు కొత్త చిక్కు వచ్చిపడింది. దశాబ్దాలుగా ఉత్తర సరిహద్దుల్లో చైనాతో వివాదాలు కొనసాగుతుండగా….భారత్‌కు చిరకాల మిత్రుడిగా ఉన్న నేపాల్ కూడా శత్రువుల జాబితాలో చేరింది.

భారత్‌కు చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపుయాధురా భూభాగాలు తమవేనంటూ నేపాల్ కొత్త మ్యాప్‌ను రూపొందించింది. ఆ ప్రాంతాలు తమవేనని…ఆ మ్యాప్ నకు సంబంధించి భారత్ తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని నేపాల్ తేల్చి చెప్పింది. అంతేకాదు, తాజాగా ఆ మ్యాప్ నకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు నేపాల్ జాతీయ అసెంబ్లీలోని ఎగువ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

దీంతో, వివాదాస్పద మ్యాప్ రాజ్యాంగ సవరణ ప్రక్రియను నేపాల్ పూర్తి చేసినట్లయింది. గతవారమే ఈ బిల్లు దిగువసభలో ఆమోదం పొందింది. ఆ బిల్లుపై ఆ దేశాధ్యక్షురాలు విద్యా దేవీ భండారీ సంతకం చేయడంతో అది చట్టపరందాల్చింది.

తాజాగా ఆ బిల్లు చట్టంగా మారడంతో నేపాల్‌ జాతీయ చిహ్నంలో లింపియాధురా, లిపులేఖ్‌, కాలాపానీ ప్రాంతాలు అధికారికంగా నేపాల్ లో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారత్ లో కయ్యానికి నేపాల్ కాలుదువ్వుతోంది. తాజాగా, భారత్ సరిహద్దుల్లో నేపాల్ హెలీప్యాడ్‌ను నిర్మించి, సైనికుల కోసం గుడారాలు ఏర్పాటు చేసింది. కాలాపానీ, లిపులేఖ్, లింపుయాధురాలు తమ భూభాగాలేనని, వీటిపై భారత్‌కు ఎలాంటి హక్కులు లేవని నేపాల్ తేల్చి చెప్పింది. భారత వ్యతిరేక చర్యలకు నేపాల్‌ దిగడం వెనుక చైనా హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాలాపానీకి పశ్చిమంగా ఉన్న ప్రాంతం పూర్తిగా భారత్‌దే. అయితే, ఇన్నాళ్లు మిత్ర దేశంగా ఉన్న నేపాల్ తో సామరస్యపూర్వకంగానే సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోంది. అదే సమయంలో మన దేశ హక్కులకు భంగం వాటిల్లకుండా చూసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. పాత రికార్డులు, ఒప్పందాలను నేపాల్ గౌరవించాలని భారత్ సూచిస్తోంది. చైనా మాయలో పడవద్దని…కోరుతోంది.