కోహ్లీ నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్యే ఎమోషనల్

ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యేల్లో కొట్టొచ్చినట్లుగా కనిపించే మహిళా ఎమ్మెల్యేల్లో మొదటి వరుసలో ఉంటారు చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ. ఏపీ వ్యాప్తంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు వెళ్లి చూడండి.. చిలకలూరి పేటకు వెళ్లి చూడండి. తేడా ఇట్టే అర్థమవుతుంది. రాజకీయ నేతలకు ఎలాంటి ప్రచారం అవసరం? ఇమేజ్ బిల్డింగ్ విషయంలో ఆమె ఎంత ముందుచూపుతో ఉంటారు? లాంటి అంశాలు ఆమెప్రాతినిధ్యం వహించే చిలకలూరి పేట పట్టణానికి వెళితే అర్థమవుతుంది.

ప్రచారం కోసం ఆమె పడే ప్రయాస.. పాలన మీదా.. ప్రజల సమస్యల మీదా పెడితే ఎంత బాగుండన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. అయినా.. అలాంటివేమీ పట్టించుకోని ఆమె.. తన తీరును మార్చుకోవటానికి ససేమిరా అంటుంటారు.తాజాగా ఆమె మరోసారి వార్తల్లోకి వచ్చారు. దీనికి కారణం.. టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ తప్పుకుంటున్నట్లుగా ప్రకటించటం.

టెస్టు జట్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన కోహ్లీ నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్యే రజనీ రియాక్టు అయ్యారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె ఎమోషనల్ రియాక్షన్ ను పోస్టు చేశారు. కోహ్లీ పోస్టుకు బదులిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.. తాను ఇలాంటి వార్తను కచ్ఛితంగా వినాలని అనుకోలేదని పేర్కొన్నారు.అయితే..కోహ్లీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని.. భారత క్రికెట్ కు కోహ్లీ అందించిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు.

రాబోయే రోజుల్లో భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా బాగా రాణించాలని.. సెంచరీల మీద సెంచరీలు చేయాలని తాను ఆకాంక్షిస్తున్నట్లుగా పేర్కొన్నారు. దాదాపు ఏడున్నరేళ్ల క్రితం (2014) ఆస్ట్రేలియా టూర్ సందర్భంగా టీమిండియా టెస్టు క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన కోహ్లీ అప్పటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతున్నారు. తాజాగా సౌతాఫ్రికాతో టెస్టు సిరసీ్ ఓటమి నేపథ్యంలో తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పి.. అభిమానులకు షాకిచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ మహిళా ఎమ్మెల్యే స్పందించి.. పోస్టు చేసిన మెసేజ్ ఇప్పుడు వైరల్ గా మారింది.