Political News

కాంగ్రెస్‌లో జ‌గ్గారెడ్డి ‘కుంప‌టి’.. కేసీఆర్‌కు మ‌ద్ద‌తిస్తారట‌!!

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, నిత్య అసంతృప్త నేత‌.. సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిజానికి కాంగ్రెస్ నేత‌ల్లో త‌న‌కంటూ.. ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న జ‌గ్గారెడ్డి.. ఎప్పుడూ.. ఏదో ఒక వివాదంతో ముందుంటున్నారు. కొన్నాళ్ల కింద‌ట కూడా.. పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసి.. త‌ర్వాత వెన‌క్కి తీసుకున్నారు. ఇక‌, ఇప్పుడు ఏకంగా.. కాంగ్రెస్‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసేలా.. సంచ‌ల‌న కామెంట్లు కుమ్మ‌రించారు. తెలంగాణ‌ను ఏపీతో క‌లిపేసి.. ఏక‌రాష్ట్రంగా ఏర్పాటు చేస్తానంటే.. కేసీఆర్ కు త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. అంతేకాదు.. తాను వ్య‌క్తిగ‌తంగా కేసీఆర్‌తో క‌లిసి న‌డిచేందుకు ప్రాధాన్యం ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు.

సమైక్యవాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకొస్తే.. తాను కూడా మద్దతిస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని.. పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను ఉద్యమ సమయంలో కూడా.. సమైఖ్య వాదం వైపే ఉన్నట్టు గుర్తు చేశారు. తనను తెలంగాణ ద్రోహి అన్నా.. ఎమ్మెల్యేగా గెలిచినట్టు పేర్కొన్నారు. ఆ రోజు తనను తప్పుబట్టిన నాయకులే.. ఇప్పుడు ఒక్కొక్కరుగా వారి ఆభిప్రాయాన్ని మార్చుకుని సమైఖ్యానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని వివరించారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయన్న జగ్గారెడ్డి.. తాను ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని.. ప్రజల అభీష్టం మేరకే నడుచుకుంటానని తెలిపారు.

“అక్కడ ఆంధ్ర, ఇక్కడ తెలంగాణ నాయకులు మళ్లీ సమైక్య రాష్ట్రాన్ని తెరపైకి తెస్తున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ సమైక్యవాదంతో ముందుకొస్తే.. నేను మద్దతు ఇస్తా. నేను ఉద్యమ సమయంలో కూడా సమైఖ్య వాదాన్నే వినిపించాను. అప్పుడు నన్ను తెలంగాణ ద్రోహి అన్నారు… అయినా నేను ఎమ్మెల్యేగా గెలిచాను. ఆ రోజు నన్ను తప్పుబట్టిన వారు… ఇప్పుడు సమైఖ్యానికి మద్దతు పలుకుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో… పార్టీ పెట్టమని కోరుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దానికి.. పార్టీ పెట్టడం ఎందుకు….రాష్ట్రాన్నే కలిపేద్దాం అని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రతిపాదించారు. ఇది ప్రజల డిమాండ్ కాదు… నాయకుల అభిప్రాయమే. నేను ప్రజల ఆలోచన మేరకే వెళ్తాను. ఏ ప్రాంతానికి నేను వ్యతిరేకం కాదు. ఆంధ్ర , తెలంగాణ, రాయలసీమ అన్ని ప్రాంతాల ప్రజలు నాకు ఒకటే“ అని జ‌గ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

ప్రత్యేక రాష్ట్రం వస్తే మెరుగైన జీవితం ఉంటుందని భావించి కొట్లాడామని జగ్గారెడ్డి తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతోనే ప్రత్యేక రాష్టం కోసం కొట్లాడినట్టు గుర్తుచేశారు. విభజన జరిగినా.. ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కోటి మందికి పైగా ఇక్కడ ఉన్నట్టు పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి అభిప్రాయం వేరని.. వ్యక్తిగతంగా తన అభిప్రాయం వేరని స్పష్టం చేశారు. సమైక్యం విషయంలో… తాను ఎవ్వరి అభిప్రాయాలను తప్పు పట్టనన్న జగ్గారెడ్డి.. ఎవ్వరి అభిప్రాయాలు వారికి ఉంటాయన్నారు. మొత్తానికి ఈ కామెంట్లు మ‌రోసారి తెలంగాణ కాంగ్రెస్‌లో మంట‌లు రేపుతున్నాయి. జ‌గ్గారెడ్డి అభిప్రాయం వ్య‌క్తిగ‌త‌మే అయిన‌ప్ప‌టికీ.. హుజూరాబాద్ ఉప పోరు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌భావం చూపుతాయ‌ని అంటున్నారు. మ‌రి కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Satya

Recent Posts

రాకా కోసం అట్లీ ముందు చూపు!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…

4 hours ago

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

7 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

10 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

10 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

10 hours ago

జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…

10 hours ago