రొట్టెముక్క కోసం గొడవపడ్డ రెండు పిల్లులు చివరికి దాన్ని కోతి పాలు చేసినట్లు.. జల వివాదాన్ని తారస్థాయికి చేర్చిన రెండు తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు కేంద్రం షాక్ ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని నీటి ప్రాజెక్టులన్నీ కృష్ణా, గోదావరి బోర్డుల ఆధీనంలోకి వెళ్లనున్నాయి. వాటి నిర్వహణతో సహా అన్ని విషయాలపై ఇక పెత్తనమంతా ఆ బోర్డులదే. ప్రాజెక్టుల నుంచి నీటి బొట్టు వాడుకోవాలన్నా.. ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలన్నా ఇప్పుడిక రెండు తెలుగు రాష్ట్రాలు బోర్డుల అనుమతి తీసుకోవాల్సిందే. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు నిర్వహణ తదితర అంశాలన్నీ ఇప్పుడు బోర్డు పరిధిలోకి వచ్చాయి. ఈ మేరకు బోర్డుల పరిధి, మార్గదర్శకాలపై గురువారం కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజుకున్న జల వివాదం చినికి చినికి గాలివానగా మారడంతో కేంద్రం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. కృష్ణా నదిపై ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు కడుతుందంటూ తెలంగాణ.. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ఏపీ పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. దీనిపై కేంద్రానికి లేఖలు కూడా రాశాయి. దీంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పడ్డాయి. వీటి పరిధిని కేంద్రం తేల్చాల్చి ఉండగా.. దీనిపై ఎన్నోసార్లు చర్చలు జరిగాయి. నీటి లెక్కలు తేల్చకుండా బోర్డుల పరిధిని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించిన తెలంగాణ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు తర్వాతే చేయాలని అప్పుడు కోరింది. ఏపీ మాత్రం బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం 811 టీఎంసీల వినియోగాన్ని లెక్కలోకి తీసుకోవాలని కోరింది. దీంతో తామే ఓ నిర్ణయం తీసుకుంటామని అప్పుడు ప్రకటించిన కేంద్ర మంత్రిత్వశాఖ తాజాగా రెండు రాష్ట్రాల మధ్య ముదిరిన నీటి గొడవల నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పాటు ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలంటూ తెలంగాణ జెన్కోను కృష్ణా బోర్డు కోరింది. తుంగభద్ర నదిపై రాజోలి బండ వద్ద నిర్మిస్తున్న కుడి కాల్వ పనులను నిలిపివేయాలంటూ ఏపీ నీటిపారుదల శాఖను కోరింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా మొత్తం కృష్ణానదిపై ఉన్న 36, గోదావరిపై ఉన్న 71ప్రాజెక్టుల బోర్డు పరిధిలోకే వస్తాయి. ఈ ప్రాజెక్టుల నిర్వహణ విధివిధానాలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, బోర్డు ఉమ్మడిగా తయారు చేయాల్సి ఉంటుంది. నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి ఉండే అధికారాలను బోర్డులు వినియోగించుకోవచ్చు. బోర్డు ఛైర్మన్, సభ్య కార్యదర్శి, చీఫ్ ఇంజినీర్లుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లు కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించినవాళ్లే ఉండాలి. ప్రాజెక్టుల నుంచి నీళ్లు, విద్యుత్ ఉత్పత్తిని బోర్డే పర్యవేక్షిస్తుంది. నిర్వహణ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డుకే ఉంటుంది. జల వివాదాలపై కేంద్రానిదే తుది నిర్ణయం. కరువు, వరదల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు తలెత్తితే ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత మాత్రం రెండు రాష్ట్రాలదే. ఈ ప్రాజెక్టులను కేంద్ర బలగాలతో పర్యవేక్షించనున్నారు.
అక్టోబర్ 14 నుంచి ఈ నోటిఫికేషన్ అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున 60 రోజుల్లో సీడ్ మనీ కింద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నిర్వహణ ఖర్చుల్ని అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాలి. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తయినా వాటిని నిలిపివేయాల్సి ఉంటుంది. మొత్తం మీద ప్రాజెక్టులు ఉండేది మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో వాటిపై పూర్తి పెత్తనం మాత్రం బోర్డులదే. నిర్వహణ ఖర్చులు చెల్లించే రాష్ట్రాలకు మాత్రం వాటిపై ఎలాంటి హక్కు ఉండదు. అయితే నీటి లెక్కలు తేల్చకుండా నోటిఫికేషన్ విడుదల చేయడంపై తెలంగాణ సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
This post was last modified on July 16, 2021 10:10 am
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…