50 రూపాయ‌ల‌కే క‌రోనా టెస్ట్.. త్వ‌ర‌లోనే ‘డ్రైస్వాబ్ కిట్‌’

క‌రోనా టెస్ట్ చేయించుకోవ‌డం పెద్ద ప్ర‌హ‌స‌నంగా మారిపోయింది. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఉచితంగానే ఈ టెస్టులు చేస్తున్న‌ప్ప‌టికీ రిజ‌ల్ట్ రావ‌డానికి టైం ప‌డుతుండ‌డంతో ప్ర‌జ‌లు ప్రైవేటు టెస్ట్ కేంద్రాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. దీంతో క‌రోనా టెస్టుకు రూ.1000 వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో చాలా మంది ఇంత ఖ‌ర్చు ఎందుకులే అని సైలెంట్ అయిపోతున్నారు. అయితే.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా అత్యంత త‌క్కువ ఖ‌ర్చుకే.. క‌రోనా టెస్ట్ చేసుకునే వెసులుబాటు క‌లుగ‌నుంది.

కోవిడ్‌ నిర్ధారణను అత్యంత త‌క్కువ ఖ‌ర్చుకే చేసే ‘డ్రైస్వాబ్‌ కిట్ల’ ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. సెంటర్‌ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యు లర్‌ బయాలజీ (సీసీఎంబీ) అభివృద్ధి చేసిన ఈ డ్రైస్వాబ్‌ కిట్ల ద్వారా ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు వేగంగా, అత్యంత త‌క్కువ ఖ‌ర్చుకే జరుగుతాయి. ఐసీఎంఆర్‌ కూడా ఈ డ్రైస్వాబ్‌ కిట్ల వినియోగానికి అనుమతిచ్చింది. దీంతో ఈ కిట్ల‌ను తయారు చేసేందుకు మెరిల్‌ డయాగ్నస్టిక్స్‌ ముందుకొచ్చింది. దేశం మొత్తమ్మీద డ్రైస్వాబ్‌ ఆధారిత పరీక్షలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు సీసీఎంబీ–మెరిల్‌ డయాగ్నస్టిక్స్‌ ఒప్పందం దోహదపడుతుంది.

సాధారణ ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షల్లో ఆర్‌ఎన్‌ఏను వేరు చేసేందుకు చాలా సమయం పడు తుండగా.. డ్రైస్వాబ్‌ కిట్ల ద్వారా తక్కువ సమయంలోనే ఈ పని చేయొచ్చు. ప్రతి నెలా దాదాపు రెండు కోట్ల డ్రైస్వాబ్‌ కిట్లను తయారు చేయనున్నారు. ఒక్కో పరీక్షకు అయ్యే ఖర్చు రూ.45–60 మధ్య ఉంటుందని వైద్యులు తెలిపారు. సుమారుగా రూ.50 ఖ‌ర్చు చేస్తే క‌రోనా టెస్ట్ వెన్వెంట‌నే పూర్త‌వుతుంద‌ని పేర్కొన్నారు.

దేశంలో ప్రస్తుతం జరుగుతున్న రోజువారీ పరీక్షలకు రెండు మూడు రెట్లు ఎక్కువ పరీక్షలు చేసేందుకు ఈ కిట్లు ఉపయోగపడతాయని సీసీఎంబీ నూతన డైరెక్టర్‌ డాక్టర్‌ నందికూరి వినయ్‌ కుమార్‌ తెలపగా.. పరీక్షలకయ్యే సమయం, ఖర్చు తగ్గుతాయని సంస్థ గౌరవ సలహాదారు డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు.

ఏమిటీ డ్రైస్వాబ్స్‌ టెక్నాలజీ?
కోవిడ్‌ వ్యాధి నిర్ధారణకు ముక్కు లేదా నోటి లోపల ఉండే ద్రవాలను పొడవాటి పుల్లల్లాంటి వాటితో సేకరిస్తారు. వీటినే స్వాబ్స్‌ అంటారు. ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు జరిగే కేంద్రాలకు ఈ నమూనాలను తీసుకెళ్లాలంటే వాటిని వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీడియం (వీటీఎం) ద్రావణంలో ఉంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతే కాకుండా.. స్వాబ్స్‌లోని జీవ పదార్థాన్ని జాగ్రత్త పరిచేందుకు కొన్ని రీఏజెంట్లను కూడా వాడతారు.

ఇవేవీ లేకుండా పొడిగా ఉండే స్వాబ్స్‌నే నేరుగా పరీక్షలు జరిగే కేంద్రా లకు తరలించేందుకు వీలుగా సీసీఎంబీ అభివృద్ధి చేసిన కొత్త టెక్నాలజీనే డ్రైస్వాబ్స్‌ టెక్నాలజీ! సాధారణ ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ ద్వారా ఫలితాలకు ఒకట్రెండు రోజుల సమయం పడితే.. డ్రైస్వాబ్స్‌ టెక్నాలజీతో మూడు గంటల్లోనే ఫలితాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా కేవ‌లం రూ.50 ఖ‌ర్చులోనే టెస్ట్ పూర్తి కావ‌డం గ‌మ‌నార్హం. అ యితే.. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వ‌చ్చేందుకు రెండు వారాల స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు నిపుణులు.