రేవంత్ స‌భ‌లో సూరీడు… వాటీజ్ గోయింగ్ ఆన్‌?

తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో రోజుకో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంటోంది. ఇలాంటి ఘ‌టన‌ల ప‌రంప‌ర‌లో బుధ‌వారం నాడు వాట‌న్నింటిని త‌ల‌ద‌న్నెలా ఓ ఘ‌ట‌న జ‌రిగింది. దివంగ‌త సీఎం వైఎఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సేవ‌కుడిగా ఆయ‌న వెన్నంటే న‌డిచిన సూరీడు అలియాస్ సూర్య‌నారాయ‌ణ రెడ్డి… వైఎస్ కు వైరి వ‌ర్గం టీడీపీలో ఏళ్ల త‌ర‌బ‌డి సాగి ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీలో చేరిన మ‌ల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి స‌భ‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. రేవంత్ స‌భా వేదిక‌పైకి ఎక్కి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసిన సూరీడు… అంత‌టితో ఆగ‌కుండా రేవంత్ లో క‌లిసి చిరున‌వ్వులు చిందిస్తూ ఫొటోల‌కు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిపోయాయి.

రేవంత్ రెడ్డి… వైఎస్ బ‌తికున్నంత కాలం టీడీపీలో కొన‌సాగిన విష‌యం తెలిసిందే. ఇద్ద‌రూ రెడ్డి సామాజిక వ‌ర్గానికే చెందిన వారే అయిన‌ప్ప‌టికీ ఇద్ద‌రిదీ భిన్న మార్గ‌మే. వైఎస్ చ‌నిపోయే దాకా కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగితే… రేవంత్ టీడీపీతోనే త‌న రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించి వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత‌, తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన చాలా కాలానికి కాంగ్రెస్ లో చేరారు. ఈ నేప‌థ్యంలో వైఎస్ ఫ్యామిలీకి, రేవంత్ కు ఏనాడూ మిత్రుత్వ‌మ‌న్న‌దే లేద‌నే చెప్పాలి. అలాంటిది వైఎస్ కు అత్యంత స‌న్నిహితుడిగానే కాకుండా వైఎస్ బ‌తికున్నంత కాలం ఆయ‌న వెన్నంటి న‌డిచిన సూరీడు.. ఇప్పుడు రేవంత్ వ‌ద్ద క‌నిపించ‌డం నిజంగానే ఆస‌క్తి రేకెత్తించేదే క‌దా.

వైఎస్ చ‌నిపోయేదాకా ఆయ‌న వెన్నంటే ఉన్న సూరీడు… చివ‌రి దాకా వైఎస్ ఫ్యామిలీకి దూరంగా జ‌రిగే వ్య‌క్తి కాద‌న్న మాట‌లు గ‌ట్టిగానే వినిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఏపీలో టీడీపీ అధికారంలో ఉండ‌గా.. సెక్ర‌టేరియ‌ట్ లో ఓ సారి క‌నిపించిన సూరీడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. అంతేకాకుండా టీడీపీ హయాంలో మంత్రిగా కొన‌సాగిన దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుతోనూ ఆయ‌న భేటీ అయిన సంగ‌తీ తెలిసిందే. మొత్తంగా వైఎస్ మ‌ర‌ణానంత‌రం ఆ ఫ్యామిలీకి సూరీడు దూరం జ‌రుగుతున్న‌ట్లుగానే క‌నిపించారు. తాజాగా తెలంగాణ‌లో కొత్త పార్టీ దిశ‌గా వైఎస్ కుమార్తె ష‌ర్మిల వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్న క్ర‌మంలో అక్క‌డి రెడ్డి సామాజిక వ‌ర్గమంతా ఆమె పార్టీలో చేరిపోతోంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ విశ్లేష‌ణ‌ల నేప‌థ్యంలో రంగారెడ్డి జిల్లా రావిరాలలో నిర్వహించిన రాజీవ్ రైతు రణభేరి సభలో సూరీడు ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది.