‘ఎన్నికల్లో చంపడానికైనా… చావడానికైనా సిద్ధం!’

ఏపీలో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండున్నరేళ్ళ తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు సై అంటే సై అంటున్నాయి. రాష్ట్రంలోని అన్నీ స్థానాలను గెలుచుకోవాలని కూటమి భావిస్తుంది. అన్నీ స్థానాల్లో పోటీ చేయాలని వైసీపీ ప్రయత్నం చేస్తుంది.

ఏకపక్షంగా ఫలితాలు రావాలని మంత్రులు, ఎమ్మెల్యేలను కూటమి ఆదేశించింది. ఏకగ్రీవాలు జరగకుండా చూడాలని వైసీపీ అధినేత హుకుం జారీ చేశారు. కూటమికి నష్టం చేస్తే సస్పెండ్ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమి ఏకగ్రీవానికి సహకరిస్తే సీటు ఇచ్చేది లేదని ఇంచార్జిలకు జగన్ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రక్తాభిషేకం చేసైనా గెలుస్తాం అంటూ కుప్పం నియోజకవర్గ ఇంచార్జి, ఎమ్మెల్సీ భరత్ చేసిన ప్రకటన కలకలం సృష్టిస్తుంది. 

ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన వైసీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో భరత్ మాట్లాడిన మాటలు నిప్పులు రాజేస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన ఆయన కుప్పం ఎన్నికలలో  నా రక్తంతో వాళ్ళు యుద్ధం చేయాలనుకుంటున్నారని ఆరోపణలు చేశారు. అధికార టీడీపీ ఎంత ఒత్తిడి చేసినా, పోలీసులను పెట్టి ఎన్ని ఇబ్బందులు సృష్టించినా వెనకంజ వేసే ప్రశ్న లేదని స్పష్టం చేశారు. నామినేషన్ వేస్తేనే సగం గెలిచినట్లు అని తేల్చి చెప్పారు. 

దీంతో కుప్పం టీడీపీ నాయకులు మండి పడుతున్నారు. వైసీపీ అనవసరంగా రెచ్చగొడుతుందని ఆరోపిస్తున్నారు. లోకల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితిలో ఏదోక రచ్చ చేయాలని కుట్రలు చేస్తుందని చెబుతున్నారు. భరత్ వ్యాఖ్యలు గొడవలు సృష్టించే విధంగా ఉన్నాయని, ఆయన మీద చట్ట పరంగా చర్యలు తీసుకోవడం ద్వారా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరుతూ రామ కుప్పం, రాళ్ళ బూదుగూరు పోలీసు స్టేషన్లలో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.

సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ భరత్ వ్యాఖ్యలు విన్న నేటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతగా ప్రవర్తించాల్సిన ఒక ఎమ్మెల్సీ విచక్షణ మరిచి మాట్లాడ్డం దారుణమని ఖండిస్తున్నారు. లోకల్ ఎన్నికలను యుద్ధంతో పోల్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రక్తం, రక్తాభిషేకం వంటి హింసాత్మాక వ్యాఖ్యలు సమర్ధనీయం కాదని ప్రజా సంఘాల నాయకులు సైతం అక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో భయాందోళన సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు చెబుతున్నారు.