రాఖీ కట్టమంటే విదేశాలకు పారిపోయాడు

అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతి రూపం రాఖీ. అలాంటి పవిత్రమైన రాఖీ పండుగ కూడా నేడు రాజకీయ చట్రంలో చిక్కుకుంది. మూడేళ్లుగా తన సోదరుడికి రాఖీ కట్టలేక పోయానంటూ తెలంగాణా రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతున్న సమయంలో ఈసారైనా కేటీఆర్ కు రాఖీ కడతారా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. దానికి తీవ్రంగా స్పందించిన కవిత గత ఏడాది రాఖీ పండుగ సమయంలో ఆయన నగరంలో లేకుండా ముఖం చాటేశారు, ఈ ఏడాది అడగక ముందే ఏకంగా విదేశాలకు వెళ్లి పోయాడని కామెంట్ చేశారు. పండుగ రోజు అందుబాటులో లేకుండా పోయిన అన్న కేటీఆర్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాఖీ అంటే రక్తబంధం, రాజకీయం కాదని స్పష్టం చేశారు. ఆయన ప్రవర్తించిన తీరుతో హర్ట్ అయ్యానంటూ ఫీలయ్యారు. ఒక ఆడబిడ్డగా నాకు ఆత్మ గౌరవం ఉంటుందని చెప్పారు. కవిత కామెంట్స్ తెలంగాణా పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీశాయి. రాజకీయాలు, కుటుంబ బంధాల మధ్య విభజన రేఖ మాయమైపోయిందని, అన్నీ విషయాలు కలగాపులగమై బంధాలు దూరం అవుతున్నాయని సామాజిక వేత్తలు విశ్లేషణ చేస్తున్నారు.

ఇదిలావుండగా కేటీఆర్ కూతురు కల్వకుంట్ల అలేఖ్య కు అమెరికాలోని ప్రతిష్టాత్మక వర్జీనియా టెక్ యూనివర్శిటీలో ఉన్నత విద్యనభ్యసించేందుకు సీటు వచ్చింది. అడ్మిషన్ కోసం కేటీఆర్ కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడ ఆయన 15 రోజులు వుంటారు. కనుక రాఖీ పండుగకు ఆయన హైదరాబాద్ లో అందుబాటులో ఉండటం లేదని సమాచారం. ఇందులో నిజానిజాలు దేముడికే తెలియాలని టీఆర్ఎస్ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు.