మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి స్థానిక ఎన్నికలు మరింత భయపెడుతున్నట్లు కనిపిస్తుంది. గెలుపోటముల సంగతి తరువాత చూసుకుందాం మొదట ఎన్నికల్లో గట్టిగా పోరాడే అభ్యర్థిని నిలుచోబెట్టాలి. అధికార టీడీపీ ఎక్కడైనా ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆ నియోజకవర్గ ఇంచార్జికి రానున్న ఎన్నికల్లో సీటు ఇచ్చేది లేదని ఖరా ఖండిగా చెప్పడం చర్చనీయంశంగా మారింది. అంటే వైసీపీ తరుపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావడం లేదన్న సంకేతాలను స్వయంగా జగనే ఇచ్చినట్లయ్యిందని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం 175 నియోజకవర్గాల ఇంచార్జిలు, మాజీ మంత్రులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం చాలా కీలకమైందని ఆ పార్టీ ప్రచారం చేసుకుంది. ఈ సందర్బంగా వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ… రాబోయే లోకల్ బాడీ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి చోటా బలమైన అభ్యర్థిని పోటీకి పెట్టాలన్నారు. అధికార పార్టీకి భయపడి ఎక్కడైనా పోటీకి దింపకుండా ఏకగ్రీవానికి అంగీకరిస్తే ఆ నియోజకవర్గం ఇంచార్జికి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు.

గెలుపోటములు ముఖ్యం కాదని, పోటీ చేయడమే అత్యంత ముఖ్యమని జగన్ చెప్పడంతో ఆ పార్టీ నాయకులు ముఖాలు చూసుకున్నారు. జగన్ ప్రసంగం స్ఫూర్తినివ్వక పొగా నిరాశ నింపిందని ఇంచార్జిలు చెప్పుకుంటున్నారు. స్థానిక ఎన్నికలలో అధికార పార్టీ పై చేయి సాధించడం సహసజమని, లోకల్ ఎన్నికల్లో పోటీకి, అసెంబ్లీ సీటుకు లింకు పెట్టడం ఓవరాక్షన్ లాగ కనిపిస్తుందని గుసగుసలాడుకుంటున్నారు.

నిజానికి 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో నాటి ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీల తరుపున ఎవ్వరినీ నామినేషన్ వేయకుండా అడ్డుకున్నట్టు విమర్శలు ఎదుర్కొంది జగన్ ప్రభుత్వం. పోలీసు బలప్రయోగంతో అత్యధిక స్థానల్లో విజయం సాధించినట్లు ప్రచారం చేసుకుంది. ఇప్పుడు జగన్ కు నాటి నిర్వాకం గుర్తుకు వచ్చినట్లుంది. ఎన్నికల్లో గెలవడం కంటే పోటీ చేయడమే ముఖ్యమని సూక్తులు చెబుతున్నాడని సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది నాయకులు యాక్టివ్ గా లేరు. నామ మాత్రంగా పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. ఒంగోలు, నెల్లూరు, పల్నాడు, గుంటూరు, విజయవాడ లోక్ సభ స్థానాల్లో అసలు నాయకులు లేరు. కొన్ని చోట్ల ఇంచార్జిలను పెట్టి నెత్తుకొస్తున్నారు. అద్దంకి, కొండపి, నెల్లూరు, పొన్నూరు, వినుకొండ, గురజాల, శ్రీకాకుళం వంటి అసెంబ్లీ స్థానాల్లో పేరుకు మాత్రమే ఇంచార్జిలున్నారు.

అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకే పోటీ చేసేవాళ్ళు లేకపోతే మున్సిపాలిటీ, జిల్లా పరిషత్ లో అభ్యర్థులు ఎక్కడ నుంచి వస్తారని వైసీపీలో అంతర్గత చర్చ జరుగుతుంది. జగన్ చెప్పినట్లే చేస్తే రేపు సగం అసెంబ్లీలకు అభ్యర్థులు వుండరని కూటమి నాయకులు విమర్శలు చేస్తున్నారు. జగన్ ఇప్పటికైనా వాస్తవం లోకి రావాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.