ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన కాపు నేతలు రామచంద్రాపురంలో సమావేశమయ్యారు. ఈ భేటీపై అంతకుముందే సమాచారం ఉండటంతో అందరూ ఈ భేటీపై ఆసక్తిగా చర్చించుకున్నారు. ఆ చర్చలు ముగిశాయి.. వైసీపీ కాపు నేతల సమావేశం కూడా ముగిసింది. అయినా సదరు సమావేశం కంటే ముందు జరిగిన చర్చకు రెట్టింపు చర్చ ఇప్పుడు రక్తి కడుతోంది. అసలు తోట నేతృత్వంలో జరిగిన సమావేశం..కాపుల సమావేశమా?, లేదంటే వైసీపీకి చెందిన కాపు నేతల సమావేశమా? అన్నదిశగా కొత్త అనుమానాలను రేకెత్తిస్తూ వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర చర్చకు తెర తీశారు.
ఇటీవల జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ వేదికగా చేసిన సంచలన ప్రసంగాన్ని ప్రస్తావించిన అంబటి… పవన్ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తూ ఈ కొత్త అనుమానాలు రేకెత్తించారు. సోమవారం మీడియా ముందుకు వచ్చిన అంబటి… కాకినాడలో పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. పవనే కుల ప్రస్తావన తీసుకొచ్చారని.. ఆ దిశగా తొలుత పవనే కుల భావన తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. గతంలో పవన్ చేసిన కామెంట్లను గుర్తు చేసిన అంబటి… ఇప్పుడేమో కులం పోవాలంటూ పవన్ వ్యాఖ్యానించడం తప్పని ధ్వజమెత్తారు.
పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ల దాకా ఓకే గానీ… అసలు రామచంద్రాపురంలో జరిగిన కాపుల సమావేశానికి రాష్ట్రంలోని యావత్తు కాపు సామాజిక వర్గం హాజరైందన్న కోణంలో అంబటి ఓ రూలింగ్ ఇచ్చారు. కూటమి సర్కారు అదికారం చేపట్టిన తర్వాత కాపులపై నేరస్తులన్న ముద్ర వేసే దిశగా పకడ్బందీగా ప్రణాళికలు అమలు అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యత్నాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కూడా పాలుపంచుకుంటూ ఉండటం, తద్వారా కాపులను ఆయన శత్రువులుగా చూడటం జరుగుతోందని అంబటి కొత్త ఆరోపణలు గుప్పించారు.
ఇక రామచంద్రాపురంలో జరిగిన కాపు నేతల సమావేశం కేవలం వైసీపీకి చెందినది మాత్రమేనని స్వయంగా తోట త్రిమూర్తులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఏం చేయాలన్న దానిపై చర్చించేందుకే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, ఈ భేటీకి ఇరత పార్టీలకు చెందిన కాపు నేతలకు తాము ఆహ్వానం పంపలేదని ఆయన పేర్కొన్నారు. వెరసి ఈ సమావేశం వైసీపీలోని కాపు నేతల సమావేశంగానే ఆయన చెప్పుకొచ్చారు.
తోట త్రిమూర్తులు చెప్పిన దాని ప్రకారం ఈ సమావేశానికి వైసీపీలోని కాపు నేతలు మినహా మరెవ్వరూ హాజరు కాలేదు. అంతేకాకుండా ఇతర పార్టీలకు సంబంధించిన కాపు నేతల ప్రస్తావనే వినిపించలేదు. వాస్తవాలైన ఈ విషయాలను ప్రస్తావించని అంబటి… రాష్ట్రంలోని మొత్తం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలపై చర్చించేందుకే ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు కలరింగ్ ఇచ్చారు. ఈ సమావేశం జరిగిన తీరుతెన్నులను గమనించిన కాపు నేతలంతా.. ఇప్పుడు అంబటి వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. కాపులంటే.. కేవలం వైసీపీలో ఉన్నవారు మాత్రమే కాపులన్నట్లుగా మాట్లాడితే ఎలాగండి అంటూ అంబటిపై సెటైర్లు పడిపోతున్నాయి.
This post was last modified on June 22, 2026 3:19 pm
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…