ఏపీ రాజధాని అమరావతికి అంత భూమి ఎందుకు? ఇంత భూమి ఎందుకు? ఏం చేసుకుంటారు.? 500 ఎకరాలు చాలవా? వెయ్యి ఎకరాలు చాలవా? అంటూ.. దీర్ఘాలు తీసేవారు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారు.. పొరుగున ఉన్న తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీని చూసి నేర్చుకోవాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. అమరావతికి ఇప్పటికే రైతులు 33 వేల ఎకరాలను ఇచ్చిన మాట వాస్తవం.
అయితే.. దీనిని ప్రపంచస్థాయి నగరంగా విస్తరించాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన.. మరిన్ని ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయించారు. మొత్తం మరో 44 వేల ఎకరాలను తీసుకుని.. తద్వారా ప్రపంచ స్థాయి విమానాశ్రయం, రైలు కనెక్టివిటీ… పెట్టుబడి దారులకు ఇచ్చే భూములు, రియల్ బూమ్ కోసం కొంత మేరకు కేటాయించాలని భావించారు. అయితే.. రెండో దశ భూ సమీకరణను వ్యతిరేకిస్తూ.. కొందరు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు.
అంతేకాదు.. రైతులను కూడా భయ భ్రాంతులకు గురిచేస్తున్నారు. తొలి దశ, మలి దశ అంటూ ఏమీ లేదని చెబుతున్నారు. దీంతో రెండో దశ భూ సమీకరణ చేయడం సర్కారుకు ఇబ్బందిగానే మారిందన్నది వాస్తవం. అయినప్పటికీ.. చంద్రబాబు సర్కారు పదే పదే రైతులకు విజ్ఞప్తి చేస్తూనే ఉంది. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్నామని.. అర్ధం చేసుకోవాలని చెబుతోంది. కొందరు అర్ధం చేసుకుంటున్నారు. మరికొందరు విష ప్రచారాన్నే నమ్ముతున్నారు.
అయితే.. నిన్నగాక మొన్న తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని ప్రతిపాదించారు. వాస్తవానికి రాజధాని హైదరాబాద్ ఉండగానే ఆయన ప్రపంచ స్థాయిలో ఫ్యూచర్ సిటీకి పిలుపునిచ్చారు. తొలి దశలో 14 వేల ఎకరాలు చాలనుకున్నారు. కానీ, ఇప్పుడు మరో వెయ్యి ఎకరాలు తీసుకునేందుకు అధికారులు రెడీ అయ్యారు. తాజాగా 300 ఎకరాల సమీకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే.. ఒక ప్రాంతాన్ని ప్రపంచ స్తాయిలో అభివృద్ధి చేసే క్రమంలో ప్రణాళికలు ఎప్పటికప్పుడు మారుతున్నాయన్నది వాస్తవం. దీనిని అర్ధం చేసుకుంటే అమరావతికి భూముల అవసరం ఎంతముఖ్యమో అర్ధమవుతుందని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates