Political News

ఇండిగో తోక కత్తిరించే పని మొదలైంది.. కొత్తగా 4 సంస్థలకు ఓకే

రంగం ఏదైనా.. వ్యాపారం మరేదైనా గుత్తాధిపత్యం అస్సలు మంచిది కాదు. పోటీ తత్వం లేకుంటే ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరు అంతకంతకూ పెరుగుతుంది. అందుకు నిలువెత్తు నిదర్శనంగా ప్రముఖ విమానయాన రంగానికి చెందిన ఇండిగో నిలుస్తుంది. ఇటీవల ఆ సంస్థ తీసుకున్న నిర్ణయాల కారణంగా లక్షలాది మంది ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. అంతేకాదు.. భారతదేశ ఇమేజ్ కు కూడా డ్యామేజ్ జరిగిన పరిస్థితి కనిపించింది. దేశీయ విమానయాన రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ఇండిగో.. తానేం చేసినా చెల్లుతుందన్నట్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మరిన్ని విమానయాన సంస్థలను రంగంలోకి దించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా నాలుగు విమానయాన సంస్థలకు ఓకే చెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 తొలి అర్థంలో ఈ విమానయాన సంస్థలు తమ సేవలను ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన శంఖ్ ఎయిర్.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ట్రూజెట్ సంస్థలకు షెడ్యూల్ విమానాలు నడిపేందుకు అవసరమైన ఎన్ ఓసీని కేంద్ర పౌర విమానయాన శాఖ జారీ చేసింది.

అంతేకాదు.. కేరళకు చెందిన అల్ హింద్ ఎయిర్.. ఫ్లై ఎక్స్ ప్రెస్ సంస్థలకు కూడా ఎన్ ఓసీలు జారీ అయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో దేశీయ విమానయాన రంగం ఒకటిగా ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. భారత ప్రభుత్వం మరిన్ని విమానయాన సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఉడాన్ పథకం కింద స్టార్ ఎయిర్.. ఇండియా వన్ ఎయిర్.. ఫ్లై91 వంటి చిన్న ఎయిర్ లైన్ సంస్థలు దేశంలో ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.

తాజాగా జారీ చేసిన అనుమతుల నేపథ్యంలో కొత్త సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో ఈ నాలుగు విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. శంఖ్ ఎయిర్ ఉత్తర భారతదేశాన్ని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంది. అల్ హింద్.. ఫ్లై ఎక్స్ ప్రెస్.. ట్రూజెట్ సంస్థలు దక్షిణ భారతదేశాన్ని కేంద్రంగా చేసుకుని సేవలు అందిస్తాయని చెబుతున్నారు. ఏపీలో త్వరలో ప్రారంభం కానున్న భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి కార్యకలాపాలు చేపట్టాలని ట్రూజెట్ కు సూచించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. గతంలో ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా సేవలు అందించినప్పటికీ.. అనంతరం వాటిని నిలిపివేసింది.

తాజా పరిణామాలతో చిన్న విమానయాన సంస్థలను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా దేశీయ విమానయాన రంగంలో గుత్తాధిపత్యానికి చెక్ పెట్టే చర్యలు ప్రారంభమయ్యాయని చెప్పాలి. అయితే చిన్న విమానయాన సంస్థలు ఇండిగో వంటి దిగ్గజ సంస్థలను తట్టుకుని నిలబడాలంటే.. ఆర్థికంగా బలోపేతం కావడానికి కేంద్రం దన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. అలా జరిగితే ఈ రంగంలోకి మరిన్ని భారీ పెట్టుబడులు రావడం ఖాయం. ఫలితంగా దేశీయ విమానయాన రంగం ఒక్క సంస్థ మీదే అధికంగా ఆధారపడే పరిస్థితి మారుతుందని చెప్పక తప్పదు.

This post was last modified on December 25, 2025 3:51 pm

Share
Show comments
Published by
Satya
Tags: Indigo

Recent Posts

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

1 hour ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

3 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

9 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

10 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

10 hours ago

లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…

11 hours ago