ట్రంప్ నే తేజస్వి స్పూర్తిగా తీసుకున్నాడా ?

బీహార్లో జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని ఆర్జేడీ చీఫ్ తేజస్వీయాదవ్ తృటిలో మిస్సయిన విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి సాధించిన ఓట్లకు మహాగఠబంధన్ (ఎంజీబీ)కు పోలైన ఓట్లకు మధ్య తేడా కేవలం 12500 మాత్రమే. ఇంత తక్కువ మార్జిన్లో ఓడిపోవటాన్ని ఆర్జేడీ చీఫ్ తేజస్వి తట్టుకోలేకపోతున్నట్లుంది. అందుకనే ఎన్డీయే కూటమి విజయంపై కోర్టులో కేసులు వేస్తానంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అవకతవకలు జరిగినట్లు తేజస్వీ తీవ్రంగా మండిపోతున్నారు.

పనిలో పనిగా పోలింగ్ అధికారుల వల్ల కూడా తమకు నష్టం జరిగినట్లు ఆరోపణలు మొదలుపెట్టారు. ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టకుండా కోర్టులో కేసు వేస్తానని చెప్పటం చూస్తుంటే అచ్చం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన విషయాలే గుర్తుకొస్తున్నాయి. హోరా హోరీగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై డెమక్రాట్ అభ్యర్ధి జో బైడెన్ గెలిచిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే బైడెన్ గెలిచినట్లు స్పష్టమైపోయిందో అప్పటి నుండి ట్రంప్ కూడా నానా రచ్చ మొదలుపెట్టారు.

బైడెన్ గెలుపుపై కోర్టుల్లో ట్రంప్ కేసులు వేయించారు. అక్కడ కూడా పోస్టల్ ఓట్లు వేయటంలోను, లెక్కింపులోను అవకతవకలు జరిగినట్లు కేసులు వేశారు. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ ఇల్లీగల్ గా గెలిచారని తాను మాత్రం లీగల్ గానే గెలిచానంటూ పిచ్చి మాటలు మొదలుపెట్టారు. బైడెన్ కు పోలైన ఓట్లను తాను గుర్తించబోనంటు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ట్రంప్ బాగా డిస్ట్రబ్ అయినట్లు కనబడుతోంది. అందుకనే అధ్యక్ష పీఠం నుండి దిగేది లేదని, వైట్ హౌస్ నుండి బయటకు వెళ్ళేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.

అమెరికాలో ట్రంప్ ఏమి చేస్తున్నారో దాదాపు ఇక్కడ తేజస్వి కూడా అదే చేస్తున్నారు. కోర్టుల్లో కేసులు వేస్తానని, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, బీహార్ ఎన్నికల్లో తానే గెలిచానని చేస్తున్న ప్రకటనలన్నీ ట్రంపు ప్రకటనలనే గుర్తు చేస్తున్నాయి. కాకపోతే ట్రంప్ అధికారంలో ఉండి బైడెన్ చేతిలో ఓడిపోయారు. బీహార్లో తేజస్వి ప్రతిపక్షంలో ఉండి పోటీచేశారంతే తేడా. మొత్తానికి ఆరోపణలు చేయటంలోను, ఎన్నికల ప్రక్రియపై గోల చేయటంలో ట్రంప్ నుండి తేజస్వీ బాగానే స్పూర్తి పొందినట్లు కనబడుతోంది.