Political News

ఎమ్మెల్సీగా రాములమ్మ ప్రమాణం… తర్వాతేంటీ?

తెలంగాణ శాసన మండలికి ఇటీవలే ఎన్నికైన పలువురు సభ్యులు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ కార్యాలయంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్, బీజేపీ తరఫున ఎన్నికైన సభ్యులంతా ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. దీంతో శాసన సభ ప్రాంగణం ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రముఖ సినీ నటి, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి కూడా ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు.

సినీ హీరోయిన్ గా ఒకింత ప్రాభవం తగ్గుతున్న సమయంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకున్న విజయశాంతి బీఆర్ఎస్ లో చేరి రాజకీయంగానూ కీలకంగా వ్యవహరించారు. విజయశాంతి కోసం మెదక్ ఎంపీ సీటును ఆ పార్టీ అధినేత కేసీఆర్ వదిలేసిన వైనం నాడు ఆసక్తి రేకెత్తించింది. నాడు మెదక్ ఎంపీగా విజయం సాధించిన విజయశాంతి ఎందుకనో గానీ… బీఆర్ఎస్ లో ఎక్కువ కాలం పాటు కొనసాగలేకపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరినా అక్కడ కూడా ఆమె సెట్ కాలేకపోయారు. చివరగా టీడీపీని వదిలి కాంగ్రెస్ పగ్గాలు చేతబట్టిన ప్రస్తుత తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆహ్వానంతో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంచి వాగ్ధాటి, ఆయా అంశాలపై అవగాహన పుష్కలంగా కలిగిన విజయశాంతి అవకాశం చిక్కితే మాత్రం చెలరేగిపోతారని చెప్పొచ్చు.

ఇక మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయశాంతికి అవకాశం దక్కుతుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం జాబితా విడుదల చేసిన తర్వాత గానీ విజయశాంతికి అవకాశం దక్కిందన్న విషయం తెలియరాలేదు. ఈ లెక్కన అధిష్ఠానం వద్ద రాములమ్మకు మంచి పేరే ఉందని చెప్పక తప్పదు. అంతేకాకుండా ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ దృష్టిని కూడా విజయశాంతి ఆకర్షించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్ మద్దతు రాములమ్మకు ఎలాగూ ఉండనే ఉంది. ఓ వైపు అధిష్ఠానం, మరోవైపు సీఎం… ఈ రెండు వర్గాలకు మధ్య వారధిగా ఉన్న మీనాక్షి గుడ్ లుక్స్ లో ఉన్న రాములమ్మ భవిష్యత్తు ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వాస్తవానికి ఈ నెల 3ననే తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగాల్సి ఉంది. ప్రస్తుతం కేబినెట్ లో 6 మంది పదవులు ఖాళీగా ఉండగా… వాటిలో ఓ నాలుగింటిని మాత్రం భర్తీ చేసి… మిగిలిన రెండింటిని కొంత కాలం పాటు అలా ఖాళీగానే ఉంచాలని అధిష్ఠానం తీర్మానించిందని వార్తలు కూడా వచ్చాయి. ఇక మంత్రి పదవులు వీరికేనంటూ ఓ జాబితా కూడా సర్క్యులేట్ అయ్యింది. సీఎం రేవంత్ గవర్నర్ ను కూడా కలిశారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఖాయమేనన్న వాదనలకు బలం చేకూరింది. అయితే ఆ మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఆలోగానే ఎమ్మెల్సీగా విజయశాంతి ప్రమాణం చేసేశారు. ఈ లెక్కన రేపో, మాపో జరిగే మంత్రివర్గ విస్తరణలో రాములమ్మకు ఎంట్రీ లభించడం, కీలకమైన మంత్రిత్వ శాఖ పగ్గాలు దక్కడం ఖాయమన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. చూద్దాం.. మరి ఏం జరుగుతుందో?

This post was last modified on April 7, 2025 1:41 pm

Share

Recent Posts

పిఠాపురంలో ఎవ్వ‌రికి ఛాన్స్ లేద‌బ్బా.. !

సామాజికంగా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌రంగా.. నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క‌…

37 minutes ago

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

1 hour ago

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

2 hours ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

2 hours ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

3 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

4 hours ago