ఏపీలో వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనాామా గోల ఇక ముగిసినట్టే. సాయిరెడ్డి సన్యాసాన్ని వైసీపీ కూడా గౌరవించింది. వెరసి తన ఖాతాలోని ఓ రాజ్యసభ సీటును ఆ పార్టీ.. కూటమి పార్టీలకు ధారాదత్తం చేసేసింది. ఈ క్రమంలో అసలు ఆట ఇప్పుడే మొదలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే…ఈ ఒక్కగానొక్క సీటును దక్కించుకునేందుకు కూటమిలోని మూడు పార్టీలకు చెందిన నేతలు తమ వంతు యత్నాలు ఇప్పటికే మొదలు పెట్టారు.
కూటమిలోని పొత్తు ధర్మాన్ని చూసుకుంటే…ఈ సీటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకు దక్కాల్సి ఉంది. అయితే పవన్ సోదరుడు కొణిదెల నాగేంద్ర బాబును ఎమ్మెల్సీని చేసి…నేరుగా రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకుందామంటూ చంద్రబాబు ఆ పార్టీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీంతో మొన్నటి మూడు రాజ్యసభ సీట్లలో ఒక దానిని, ఇప్పుడు అందివస్తున్న మరోదానిని ఆ పార్టీ త్యాగం చేసేసినట్టేనని చెప్పక తప్పదు.
ఇక మిగిలింది రెండు పార్టీలు… టీడీపీ, బీజేపీలే కదా. వాటిలోనూ మొన్నటి మూడు రాజ్యసభ సీట్లలో రెండు సీట్లను తీసుకున్న టీడీపీ… ఓ సీటును బీజేపీకి ఇచ్చింది. ఈ లెక్కన ఇప్పుడు సాయిరెడ్డి రూపంలో అందివస్తున్న రాజ్యసభ సీటు బీజేపీకే దక్కాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కూటమిలో బిగ్ ప్లేయర్ టీడీపీనే కదా. బలం, బలగం విషయంలో బీజేపీది కూటమిలో థర్డ్ ప్లేసే కదా. దీంతో సాయిరెడ్డి సీటును కూడా టీడీపీనే తీసుకుంటుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అలా కాకుండా బీజేపీకి ఆ సీటు దక్కితే గనుక ఆ పార్టీ నేతల మధ్య బిగ్ ఫైట్ తప్పదని చెప్పాలి.
సాయిరెడ్డి సీటు బీజేపీకే దక్కితే.. రేసులో అందరికంటే ముందు ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర విభజనను ఆపలేకపోయారన్న అపవాదుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఈ నేతను ఏపీ ప్రజలు దాదాపుగా వెలేశారు. నల్లారి పెట్టిన సొంత పార్టీకి దక్కిన ఫలితం, ఆ తర్వాత ఆ పార్టీకి పట్టిన గతే దీనికి నిదర్శనం. ఆ తర్వాత నల్లారి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి.. అన్నను వదిలేసి టీడీపీలో చేరిపోయి మొన్నటి ఎన్నికల్లో పీలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
వయసు మీద పడుతోంది. ఆపై ఈ కాలం కుర్ర నేతలతో పోటీపడే ఓపిక కూడా నల్లారికి లేదనే చెప్పాలి. ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకున్న నల్లారి తన ఆలోచనలన్నీ పక్కనపెట్టేసి నేరుగా వెళ్లి బీజేపీలో చేరిపోయారు. మొన్నటి ఎన్నికల్లో రాజంపేట లోక్ సభ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి వైసీపీ యువ నేత పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత మరింతగా కనుమరుగు అయిన నల్లారి..ఇప్పుడు సాయిరెడ్డి సీటును దక్కించుకుని తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చేందుకు అందరికంటే ముందు మేల్కొన్నారు.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, నల్లారి.. ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందిన నేతలే. వీరి మధ్య రాజకీయంగా కొంత విభేదాలు నడిచినా… ఆ తర్వాత వీరిద్దరి మధ్య మంచి మిత్రుత్వమే కొనసాగుతోంది. నల్లారి పేరును బీజేపీ ప్రతిపాదిస్తే చంద్రబాబు వ్యతిరేకించకపోవచ్చన్నది నిపుణుల మాట. ఇక రాజ్యసభలో తన సొంత బలాన్ని పెంచుకోవాలని వ్యూహాత్మకంగా సాగుతున్న బీజేపీ… ఈ సీటును తమకే ఇవ్వాలని అడిగినా…చంద్రబాబు కానదలేకపోవచ్చని తెలుస్తోంది. మొత్తంగా ఈ అంచనా నిజమైతే మాత్రం మళ్లీ నల్లారికి రాజకీయంగా పునరుజ్జీవం లభించినట్టేనని చెప్పక తప్పదు.
This post was last modified on January 26, 2025 10:01 am
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…