బాలయ్య పండగ – అన్ స్టాపబుల్ 4

సెలబ్రిటీ టాక్ షోలు గతంలో ఎన్నో వచ్చినప్పటికీ ఆహాలో ఆన్ స్టాపబుల్ సృష్టించిన ట్రెండ్ వేరు. అప్పటిదాకా వెండితెరపై శక్తివంతమైన పాత్రల్లో బాలకృష్ణను చూసిన ప్రేక్షకులు చిన్న స్క్రీన్ పై టాలీవుడ్ తారలతో కలిసి పంచుకునే ముచ్చట్లు, చేసిన సందడి చూసి మురిసిపోయారు. ప్రభాస్ ఎపిసోడ్ కి సర్వర్లు క్రాష్ అయితే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఏకంగా ఊళ్ళల్లో బ్యానర్లు వెలిశాయి. అల్లు అర్జున్ విచ్చేస్తే మిలియన్ల వ్యూస్ వెల్లువలా వచ్చి పడితే విశ్వక్ సేన్, అడవి శేష్ లాంటి వాళ్ళు చేసిన అల్లరి నవ్వులు పంచాయి. ఏపి సీఎం చంద్రబాబునాయుడు భావోద్వేగం కూడా ఇందులోనే పరిచయమయ్యింది.

మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ బ్లాక్ బస్టర్ సిరీస్ కు నాలుగో భాగం అక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ తో పాటు షో విశేషాలు పంచుకోవడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సరికొత్తగా కట్ చేసిన ట్రైలర్ తో ఆశ్చర్యానికి గురి చేశారు. ఏమి దొరకని ఒక మారుమూల ప్రాంతంలో జనం తమను కాపాడేవాడి కోసం ఎదురు చూస్తున్నప్పుడు బాలయ్య వచ్చి దుర్మార్గుల భరతం పట్టి ప్రజలు కోరినవి ఇచ్చి వాళ్లకు సంతోషం పంచుతాడు. ఇకపై ప్రతి రోజు పండగేనని హామీ ఇస్తాడు. ఇదంతా యానిమేషన్ రూపంలో చూపించినా డబ్బింగ్ స్వంతంగా బాలయ్యే చెప్పడం విశేషం.

ఇదయ్యాక బాలకృష్ణ వచ్చి ఇకపై మరింత ఘాటుగా వినోదాత్మకంగా అన్ స్టాపబుల్ సీజన్ 4 ఉంటుందని హామీ ఇచ్చే విజువల్ తో వీడియోని ముగించారు. సరిపోదా శనివారంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన జేక్స్ బెజోయ్ ఈ ట్రైలర్ కు నేపధ్య సంగీతం సమకూర్చడం విశేషం. ఇప్పటికే కొందరు స్టార్లతో కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ 4లో ఈసారి చాలా స్పెషల్ గెస్టులు వస్తారని టాక్. ఎప్పుడూ చూడని విశిష్ట అతిధులతో అరుదైన కలయికలు చూడొచ్చని అంటున్నారు. ఆహాకు మరోసారి జాక్ పాట్ ఖాయమే. అల్లు అరవింద్, తేజస్విని సంయుక్త నిర్మాణంలో షో రూపొందుతోంది.