విడాకుల వార్తలకు చెక్ పెట్టిన ఉంగరం

ఈ మధ్య ఫిలిం సెలబ్రెటీల విడాకుల వార్తలు చాలా చూస్తున్నాం. గత కొన్నేళ్లలో నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య.. ఇలా చాలామంది విడిపోయారు. లేటెస్ట్‌గా జయం రవి-ఆర్తి జంట కూడా విడాకులు తీసుకుంటున్న విషయం వెల్లడైంది. ఈ క్రమంలోనే బాలీవుడ్లో సెలబ్రేటెడ్ కపుల్ అయిన అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్ కూడా విడిపోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇటీవల అంబానీ కుటుంబంలో జరిగిన పెళ్లి వేడుకకు భర్తతో కాకుండా విడిగా వచ్చింది ఐశ్వర్య. తన వెంట కూతురు కూడా ఉంది. ఆల్రెడీ అభిషేక్, ఐశ్వర్య మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వస్తున్న టైంలోనే ఐశ్వర్య ఇలా భర్తతో కాకుండా విడిగా ఓ పెద్ద వేడుకకు రావడంతో ఈ ఊహాగానాలు నిజమేనన్న చర్చ జరిగింది. విడాకుల గురించి వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఐతే ఇప్పుడు ఆ వార్తలకు స్వయంగా ఐశ్వర్యనే చెక్ పెట్టింది.

తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్‌కు తన కూతురు ఆరాధ్యతో కలిసి హాజరైంది ఐశ్వర్య. ఈ వేడుకలో ఆమె ధరించిన ఉంగరం అందరి దృష్టినీ ఆకర్షించింది. అది పెళ్లి సమయంలో అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్యకు తొడిగింది కావడం విశేషం. ఈ దశలో ఆమె ఈ ఉంగరం వేసుకుందంటే విడాకుల వార్తలకు చెక్ పెట్టడానికే అయి ఉండొచ్చని భావిస్తున్నారు. మరి మధ్యలో అభిషేక్‌తో దూరం దూరంగా ఉన్న సంకేతాలు ఎందుకు ఇచ్చిందో తెలియదు.

కెరీర్ ఆరంభంలో కొన్ని రిలేషన్‌షిప్స్‌తో ఇబ్బంది పడ్డ ఐశ్వర్య.. తర్వాత అభిషేక్‌కు చేరువైంది. వీళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా ఏళ్ల పాటు బచ్చన్ కుటుంబంలో ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించిన ఐశ్వర్య.. ఈ మధ్య మాత్రం భర్తకు దూరంగా ఉంటున్న సంకేతాలు ఇచ్చింది. దీంతో విడాకుల గురించి ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు తన తాజా చర్యతో విడాకుల ప్రచారానికి తెరపడింది.