శర్వా ముందుకు… గాంజా పక్కకు

అప్పుడెప్పుడో నెలల క్రితం సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు సంపత్ నందితో సితార సంస్థ గాంజా శంకర్ ని అధికారికంగా ప్రకటించింది. చిన్న కాన్సెప్ట్ టీజర్ రిలీజ్ చేశారు. ఊర మాస్ కంటెంట్ తో తేజుని మునుపెన్నడూ చూడని అవతారంలో డిజైన్ చేశారనే వార్త గట్టిగా చక్కర్లు కొట్టింది. పూజా హెగ్డే హీరోయిననే వార్త బాగా తిరిగింది. కట్ చేస్తే సెట్స్ పైకి వెళ్లకుండానే గాంజా శంకర్ ఆగిపోయింది. బడ్జెట్ ఇష్యూస్ అన్నారు కానీ నిజానిజాలు అఫీషియల్ గా బయటికి రాలేదు. దానికి తోడు టైటిల్ మీద అభ్యంతరాలు రావడం మరో ట్విస్ట్. ఏదైతేనేం మొత్తానికి ప్రాజెక్టు క్యాన్సిల్.

ఇప్పుడీ గాంజా శంకర్ ని పూర్తిగా పక్కనపెట్టేసి ఫ్రెష్ సబ్జెక్టుతో సంపత్ నంది హీరో శర్వానంద్ తో చేతులు కలిపాడు. ఇది వేరే కథ. అరవై సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని యాక్షన్ డ్రామాగా రూపొందించబోతున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నాడు. రామ్ చరణ్ రచ్చతో తొలి బ్రేక్ అందుకున్న సంపత్ నంది మళ్ళీ ఆ స్థాయి విజయం సాధించలేదు. సీటిమార్ తర్వాత ఎక్కువ గ్యాప్ వచ్చేసింది. నిర్మాతగా చిన్న చిత్రాలు తీస్తున్నప్పటికీ డైరెక్టర్ గా సరైన కాంబో కోసం ఎదురు చూసినందుకు మంచి ఫలితమే దక్కింది.

ఒకే ఒక జీవితం సక్సెస్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న శర్వానంద్ కు సంపత్ చెప్పిన పాయింట్ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం తను అభిలాష్ డైరక్షన్ లో ఒకటి, రామ్ అబ్బరాజుతో మరొకటి రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సంపత్ నందిది మూడోది. కెకె రాధామోహన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎలాగైనా ఋజువు చేసుకుని కంబ్యాక్ ఇవ్వాల్సిన ఒత్తిడి సంపత్ నంది మీద ఉంది. పీరియాడిక్ డ్రామా కాబట్టి టేకింగ్, మేకింగ్ రెండూ ఛాలెంజింగ్ గా ఉండబోతున్నాయి. కమర్షియల్ అంశాలు మిస్ కాకుండానే కొత్త అనుభూతినిచ్చే బ్యాక్ డ్రాప్ ఉంటుందట.