పూనమ్ వ్యాఖ్యలపై తమ్మారెడ్డి ఏమన్నారంటే..?

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. తన అసిస్టెంట్ అయిన ఓ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా తీవ్ర స్థాయిలో వేధించినట్లు ఆరోపణలు రావడం.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఇండస్ట్రీలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. ఇండస్ట్రీ తరఫున కూడా తమ్మారెడ్డి భరద్వాజ లాంటి పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇష్యూ గురించి మాట్లాడారు.

ఐతే ఇదే సమయంలో పూనమ్ కౌర్ ‘ఎక్స్’లో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. గురూజీ అని పిలవబడే త్రివిక్రమ్ శ్రీనివాస్ తనతో సహా చాలామంది మహిళలను ఇబ్బంది పెట్టాడని.. దీనిపై గతంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని.. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేసింది. దీంతో జానీ మాస్టర్ వ్యవహారాన్ని మించి ఈ టాపిక్ చర్చనీయాంశం అయిపోయింది. త్రివిక్రమ్ మీద పూనమ్ విమర్శలు, ఆరోపణలు చేయడం కొత్త కాదు. కానీ ఇప్పుడు సందర్భం చూసి ఆయన్ని టార్గెట్ చేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

ఐతే జానీ మాస్టర్ ఇష్యూ మీద ఓ యూట్యూబ్ ఛానెల్‌కు తమ్మారెడ్డి భరద్వాజ ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా.. పూనమ్ వ్యవహారం చర్చకు వచ్చింది. ఆమె పెట్టిన పోస్టును ప్రస్తావిస్తూ.. త్రివిక్రమ్ మీద చేసిన ఆరోపణల గురించి యాంకర్ తమ్మారెడ్డిని ప్రశ్నించింది. దీనికాయన బదులిస్తూ.. పూనమ్ ఇప్పటిదాకా ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేయలేదని చెప్పారు. తాము ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసమే ఒక ప్యానెల్ ఏర్పాటు చేశామని.. కొన్నేళ్లుగా ఇది నడుస్తోందని.. ఇందులో ఎవరు ఫిర్యాదు చేసినా స్పందించి చర్యలు చేపడతామని ఆయన అన్నారు.

ఫిలిం ఛాంబర్లో ఒక రెడ్ బాక్స్ ఉంటుందని.. అందులో ఫిర్యాదు లెటర్ వేస్తే చాలని ఆయనన్నారు. పూనమ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసినట్లు చెబుతోందని.. కానీ వాళ్ల నుంచి కూడా తమకు సమాచారం రాలేదని.. ఇప్పటికైనా సరే పూనమ్ తమకు ఫిర్యాదు చేస్తే.. ఆధారాలు సమర్పిస్తే దాని మీద విచారిస్తామని ఆయన చెప్పారు. మరి ఈ సూచనను అనుసరించి త్రివిక్రమ్ మీద ఫిలిం ఛాంబర్‌కు పూనమ్ ఫిర్యాదు చేస్తుందేమో చూడాలి.