భరోసా ఇస్తున్న కొత్త తరం కమెడియన్లు

టాలీవుడ్ లో హాస్య నటుల కొరత ఉంది. అలాని టాలెంట్ లేక కాదు. వాళ్ళను వాడుకునే దిశగా దర్శకులు సరైన కంటెంట్ రాసుకోవడం లేదు. కరెక్ట్ గా పడితే కొత్త తరం కమెడియన్లు ఎలా చెలరేగిపోతారో చెప్పేందుకు కొందరు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. నిన్న రిలీజైన ఆయ్ లో నవ్వించే భారం మొత్తం రాజ్ కుమార్ కసిరెడ్డి మీదే పడింది. దాన్ని అతను సునాయాసంగా మోశాడు. చాలా సన్నివేశాల్లో హీరో హీరోయిన్లను డామినేట్ చేస్తూ మరీ ఈ నవ్వుల పర్వం కొనసాగించాడు. వేరే ఆర్టిస్టు అయితే ఎలా ఉండేదో కానీ యూత్ కి మాత్రం ఇతను బాగా కనెక్టయ్యాడు. ఇటీవలి కాలంలో దొరికిన పెద్ద బ్రేక్ ఇదే.

ఇక సత్య మరో ప్రత్యేకమైన ఆర్టిస్టు. దొరికిన కొంత నిడివిని పూర్తిగా వాడేసుకుని తన ఉనికిని చాటుకుంటున్నాడు. మిస్టర్ బచ్చన్ లో రవితేజ ఎనర్జీని తట్టుకుంటూ మరీ కామెడీ చేయడం మాములు విషయం కాదు. టాక్ సంగతి పక్కనపెడితే భాగ్యశ్రీ బోర్సే వెంటపడే జులాయిగా మంచి టైమింగ్ చూపించాడు. జాతిరత్నాలు టైంలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు ఇలాగే కనిపించారు కానీ తర్వాత మహా బిజీ అయిపోవడంతో గ్యాప్ వచ్చేసింది. ప్రియదర్శి హీరోగా మారాక హీరో పక్కన రోల్స్ చేయడం లేదు. రాహుల్ ఛాన్స్ ఇస్తే మాత్రం ఆయా క్యారెక్టర్లను నిలబెడుతున్నాడు.

వెన్నెల కిషోర్ మరో ప్రామిసింగ్ పేరు. ఈ మధ్య కొంచెం రొటీన్ అనిపిస్తున్నా తనదైన పాత్ర దొరికితే బెస్ట్ ఇస్తాడు. వైవా హర్షకు మంచి క్యారెక్టర్లు పడటం లేదు. సుందరం మాస్టర్ తో హీరో అయినా కామెడీ రోల్స్ కే ప్రాధాన్యం ఇస్తున్నాడు. అభినవ్ గోమటంని వాడుకోవడం దర్శకుల చేతుల్లో ఉంది. షకలక శంకర్, సత్యం రాజేష్, సప్తగిరి వీళ్లంతా సీనియర్ బ్యాచులోకి వచ్చేశారు. బిత్తిరి సత్తిని తెస్తున్నారు కానీ ఏమంత ప్రభావం ఉండటం లేదు. నిన్నటి తరం హాస్య నటుల హవా తగ్గిపోయాక వినోదాన్ని నడిపించే బాధ్యత వీళ్ళ మీదే ఉంది. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునే దర్శకులే కావాలి.