ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రానా

టాలీవుడ్లో ఉన్న ట్రూ పాన్ ఇండియా యాక్టర్లలో రానా దగ్గుబాటి ఒకడు. ‘బాహుబలి’ కంటే ముందే అతను రెండు బాలీవుడ్ చిత్రాలతో హిందీ ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించాడు. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మోగింది. తర్వాత తన ప్రతి సినిమా పట్ల పర భాషా నటులు కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఒక టైంలో బహు భాషల్లో విరామం లేకుండా సినిమాలు చేశాడు రానా. కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ కూడా చేశాడు. కానీ ఈ మధ్య అతడి కెరీర్లో బాగా గ్యాప్ వచ్చేసింది.

గత ఏడాది కాలంలో తన నుంచి కొత్త రిలీజే కాలేదు. ఓటీటీలో వచ్చిన ‘రానా నాయుడు’ సిరీస్‌ను పక్కన పెడితే.. గత రెండేళ్లలో సినిమా రిలీజ్‌లే లేవు. చివరగా రెండేళ్ల కిందట ‘విరాటపర్వం’ చిత్రంతో పలకరించాడతను. బిజీయెస్ట్ యాక్టర్లలో ఒకడిగా కనిపించిన రానా.. ఇంత గ్యాప్ తీసుకున్నాడేంటి అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ఐతే ఎట్టకేలకు తన కొత్త చిత్రాన్ని రానా ఓకే చేసినట్లు సమాచారం. కిషోర్ అనే కొత్త దర్శకుడితో రానా తన తర్వాతి సినిమాను చేయబోతున్నాడట. అదొక హార్రర్ టచ్ ఉన్న మూవీ అని సమాచారం. ఈ చిత్రాన్ని బాహుబలి నిర్మాతలు ప్రొడ్యూస్ చేయబోతుండడం విశేషం. బాహుబలి తర్వాత ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని చిన్న సినిమాలే తీస్తూ వచ్చారు. కానీ రానాతో కొంచెం పెద్ద రేంజ్ మూవీనే ప్లాన్ చేశారట శోభు, ప్రసాద్. రానా అనగానే ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ఉంటుందనడంలో సందేహం లేదు.

ఇదిలా ఉండగా రానా ఇటీవలే ‘రానా నాయుడు-2’ షూట్ మొదలుపెట్టాడు. సీజన్-1 మీద చాలా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈసారి కంటెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారట రానా అండ్ కో. రానా బాబాయి వెంకటేష్ కూడా నటిస్తున్న ఈ సిరీస్ రెండో సీజన్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది.