రామ్ పూరి ‘డబుల్’ నమ్మకం

డబుల్ ఇస్మార్ట్ విడుదల ఇంకో రెండే రోజుల్లో జరగనుంది. ఇటీవలే జరిగిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అభిమానుల్లో అప్పటికే ఉన్న నమ్మకం రెట్టింపయ్యింది. లైగర్ తాలూకు పీడకలల్ని మర్చిపోని పూరి జగన్నాధ్ చాలా కసిగా దీనికి పని చేసినట్టు నొక్కి చెప్పాడు. రామ్ ఎనర్జీని వంద శాతం వాడుకుని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇస్తానని ధీమా వ్యక్తం చేశాడు. సహనిర్మాత ఛార్మీ గతంలోలా ఎలివేషన్ల జోలికి పోకుండా సక్సెస్ అయ్యాకే మాట్లాడతానని చెప్పడం మరో విశేషం. మొదటి భాగం రిలీజైనప్పుడు ఇంత హైప్ లేదన్నది వాస్తవం. కానీ ఇప్పుడు బజ్ ఏకంగా డబుల్ అయ్యింది.

పోటీపరంగా డబుల్ ఇస్మార్ట్ చుట్టూ చాలా సవాళ్లున్నాయి. ఆర్థిక వ్యవహారాలు చివరి నిమిషం దాకా ఇబ్బంది పెట్టినా ఫైనల్ గా సర్దుకున్నాయి. మిస్టర్ బచ్చన్ ఏకంగా ముందు రోజు సాయంత్రమే ప్రీమియర్లు వేస్తోంది. రాత్రి దానికొచ్చే టాక్ ఏ విధంగా డబుల్ ఇస్మార్ట్ ని ప్రభావితం చేస్తుందో అంచనా వేయొచ్చు. తంగలాన్ పట్ల మూవీ లవర్స్ లో ఆసక్తి ఉన్నప్పటికీ సామాన్య ప్రేక్షకులకు దీని పట్ల క్రేజ్ తో లేరని అడ్వాన్స్ బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇక ఆయ్ ని మరీ సీరియస్ గా తీసుకోలేం కానీ బన్నీ వాస్, అల్లు అరవింద్ ధైర్యం చూస్తుంటే మ్యాటరేదో బలంగా కనిపిస్తోంది.

ఇవన్నీ ఎన్ని ఉన్నా రామ్ పూరి డబుల్ నమ్మకం ఒక్కటే. తమ సినిమాలో ఉన్నంత ఊర మాస్ కంటెంట్ వేరే దేంట్లోనూ లేదు. థియేటర్లు విజిల్స్ తో ఊగిపోయే యాక్షన్ ఎపిసోడ్స్, లేచి డాన్సులు చేసే పాటలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎంతో గ్యాప్ తర్వాత అలీతో ప్రత్యేకంగా ఒక కామెడీ ట్రాక్ పెట్టడం కూడా అందులో భాగమే. నార్త్ లో స్త్రీ 2 రూపంలో ఊహించని స్పీడ్ బ్రేకర్ అడ్డుపడుతోంది కానీ డబుల్ ఇస్మార్ట్ టాక్ కనక పాజిటివ్ గా వస్తే బాలీవుడ్ లోనూ మంచి స్పందన చూడొచ్చు. ఇంకో నలభై ఎనిమిది గంటల్లో తేలబోయే ఫలితం కోసం అందరూ వెయిటింగ్.