సాహో హీరోయిన్ దుమ్ము లేపుతోంది

మనకు ప్రభాస్ సాహో ద్వారా పరిచయమయ్యాక తిరిగి కనిపించకుండా బాలీవూడ్ కే పరిమితమైన శ్రద్ధా కపూర్ కొత్త సినిమా స్త్రీ 2 ఈ వారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల కాబోతోంది. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ కి కొనసాగింపు కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే స్టార్ హీరో లేకపోయినా దీనికి వస్తున్న క్రేజ్ చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. రిలీజ్ ఇంకా అయిదు రోజులు ఉండగానే 1 లక్ష టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడుపోవడం చూసి షాక్ తింటున్నారు. ఆగస్ట్ 15 ఉదయం షో పడేలోపు ఈ కౌంట్ సులభంగా నాలుగు లక్షల దాకా వెళ్లొచ్చని టాక్.

దీని గురించి ప్రత్యేకంగా చెప్పడానికి కారణముంది.అదే రోజు వస్తున్న అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే పట్టుమని పది వేల టికెట్లు కూడా అమ్మలేకపోయింది. స్త్రీ 2 కంటే ఎక్కువ ప్రమోషన్లు దీనికే చేస్తున్నారు. గత మూడేళ్ళుగా దారుణమైన ట్రాక్ రికార్డు అక్షయ్ మార్కెట్ ని దారుణంగా దెబ్బ తీయడమే కాకుండా అభిమానుల్లో కూడా ఆసక్తిని తగ్గించేసింది. దీనికన్నా జాన్ అబ్రహం వేదా కొంచెం మెరుగ్గా బుకింగ్స్ చూపిస్తోంది. ఈ రెండు స్త్రీ 2 దరిదాపుల్లో లేకపోవడం విశేషం. అంటే అక్షయ్, జాన్ స్టార్ డం కన్నా శ్రద్దా కపూర్ కంటెంట్ ఆధిపత్యమే ఎక్కువగా ఉందనే విషయం స్పష్టమైపోయిందిగా.

ముందు రోజు సాయంత్రమే స్త్రీ 2 స్పెషల్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. సౌత్ లో డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్ లాంటి క్రేజీ మూవీస్ తో విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ నిర్మాతలు మల్టీప్లెక్స్ స్క్రీన్లు వీలైనంత ఎక్కువ దక్కించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రెండ్ చూస్తుంటే యానిమల్, టైగర్ 3, బ్రహ్మాస్త్ర పార్ట్ 1 అడ్వాన్స్ బుకింగ్స్ కి దగ్గరగా వెళ్లడమో లేదా వాటిలో ఒకటో రెండో దాటడమో స్త్రీ 2 చేస్తుందని సమాచారం. హారర్ కామెడీ జానర్ లో రూపొందిన ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, రాజ్ కుమార్ రావు తదితరులు కీలక పాత్రలు పోషించగా తమన్నా స్పెషల్ గ్లామర్ సాంగ్ చేసింది.