బాలు కోసం రామోజీ డ్రైవర‌వుతాన‌న్న‌ వేళ..

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీద సంగీత ప్రియులకు ఉన్న అభిమానాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన ఘనత రామోజీ రావుదే. ఆయన ఈటీవీలో బాలు ఆధ్వర్యంలో నడిపించిన ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాం ఎంతటి ఆదరణ సంపాదించుకుందో.. సంగీత ప్రియుల్ని ఎంతగా అలరించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రోగ్రాం ద్వారానే రామోజీ రావు, బాలుల మధ్య గొప్ప అనుబంధం ఏర్పడింది.

చెన్నైలో నివాసముండే బాలు.. ఈ ప్రోగ్రాం కోసం ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు. ఐతే ఈ సందర్భంగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బాలు అడుగు పెట్టిన దగ్గర్నుంచి తిరిగి వెళ్లే వరకు ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా కూడా రామోజీ గ్రూప్ వాళ్ల కారునే వాడేవారట. చెన్నైలో బయల్దేరే ముందు ఫోన్ చేసి విషయం చెప్పగానే ఆయన కోసం ఎయిర్‌పోర్టులో కారుండేదట. హైదరాబాద్‌లో ఇంకా ఏమేం పనులున్నప్పటికీ బాలు ఆ కారులోనే వెళ్లేవారట.

గతంలో ‘పాడుతా తీయగా’ సంబంధించిన ఒక బహుమతి ప్రదానోత్సవంలో రామోజీ రావు పక్కనుండగా బాలు ఈ విషయాల్ని వెల్లడించారు. ఒకసారి వ్యక్తిగత పని మీద తాను హైదరాబాద్ వచ్చానని.. ఆ సమయంలో కారు కోసం రామోజీ గారి ఆఫీసుకి ఫోన్ చేస్తే ఎవరూ రెస్పాండవలేదని.. దీంతో ధైర్యం చేసి తాను నేరుగా రామోజీ గారి ఇంటికే ఫోన్ చేశానని.. స్వయంగా ఆయనే ఫోన్ తీశారని.. కారు గురించి చెబితే ఆయన కనుక్కుని చూశారని.. ఆదివారం కావడం వల్ల డ్రైవర్లెవరూ అందుబాటులో లేరని చెప్పారని బాలు వెల్లడించారు.

ఐతే వేరే డ్రైవర్లు లేకపోయినా.. మరొకరు ఉన్నారని.. అతను కారు నడిపి చాలా కాలం అయిందని చెబుతూ ఆ వ్యక్తి పేరు ‘రామోజీ రావు’ అని వెల్లడించారని.. ఆయనలా అనగానే తాను సిగ్గు పడ్డానని, ఎక్కువ చనువు తీసుకున్నానా అనిపించిందని బాలు చెప్పారు. ఐతే త‌ర్వాత రామోజీ రావు పెద్ద కొడుకు కిర‌ణ్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చి త‌నను రిసీవ్ చేసుకున్న‌ట్లు బాలు వెల్ల‌డించారు.