ధనుష్ స్పీచ్ మీద ట్రోలింగ్

తమిళ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే కథానాయకుల్లో ధనుష్ ఒకడు. అతను ఎంత కష్టపడి స్టార్ హోదాను అందుకున్నాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోనే మేటి నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకోవడమే కాక.. నటుడిగా రెండు, నిర్మాతగా రెండు నేషనల్ అవార్డులు గెలిచిన ఘనత తన సొంతం.

క్యారెక్టర్ రోల్స్‌‌కి కూడా పనికి రాడు అని తొలి చిత్రం ‘తుల్లువదో ఎలమై’ టైంలో విమర్శలు ఎదుర్కొన్న వాడే.. ఇప్పుడు ప్రపంచస్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ శుక్రవారమే ధనుష్ కొత్త చిత్రం ‘రాయన్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఆ సినిమాకు దర్శకుడు కూడా ధనుషే. ఐతే ఈ సినిమా తమిళ ఆడియో లాంచ్ కార్యక్రమంలో ధనుష్ చేసిన ప్రసంగం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. సోషల్ మీడియాలో ఈ స్పీచ్ మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది.

ధనుష్ ఈ మధ్యే చెన్నైలో పోష్ ఏరియా అయిన పోయెస్ గార్డెన్స్‌లో లగ్జీరియస్ ఇల్లు కొన్నాడు. దాని విలువ రూ.150 కోట్లు అంటున్నారు. ఐతే ఈ ఇంటి వెనుక కథ ఒకటి ఉంది అంటూ ‘రాయన్’ ఆడియో లాంచ్‌లో ధనుష్ మాట్లాడాడు. తనకు 16 ఏళ్ల వయసున్నపుడు ఫ్రెండుతో కలిసి రజినీ ఇల్లు చూడ్డానికి పోయెస్ గార్డెన్స్ ప్రాంతానికి వెళ్లానని.. అది చూశాక మరోవైపు జయలలిత ఇంటి దగ్గర జనం గుమికూడి ఉండడం చూశానని.. ఆ రోజే తాను కూడా ఇక్కడో ఇల్లు కొనాలని అనుకున్నానని.. ఇప్పుడు అనుకున్నట్లే ఇల్లు కొన్నానని చెప్పాడు ధనుష్.

ఐతే ఈ స్టోరీ నమ్మశక్యంగా లేదని.. రజినీ ఒకప్పుడు ఫియట్ కారు గురించి చెప్పిన స్టోరీని ధనుష్ ఇమిటేట్ చేస్తున్నాడని.. అయినా ధనుష్ ఏ బ్యాగ్రౌండ్ లేని పేదవాడేమీ కాదని.. అతడి తండ్రి అప్పటికే పేరున్న దర్శకుడని.. అలాంటి నేపథ్యం నుంచి వచ్చి తండ్రి దర్శకత్వంలో నటుడిగా అరంగేట్రం చేసిన వ్యక్తి.. తానేదో పేద కుటుంబం నుంచి వచ్చి.. కలలు కని వాటిని నెరవేర్చుకున్నట్లు బిల్డప్ ఇవ్వడం ఏంటి అంటూ ధనుష్ స్పీచ్‌ను ట్రోల్ చేస్తున్నారు తమిళ నెటిజన్లు. ఐతే ధనుష్ అంత తప్పుగా ఏం మాట్లాడేశాడు, అందులో అతిశయోక్తులేమున్నాయి అంటూ తన మద్దతుదారులు ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు.