చిరు క్లారిటీ.. సుజీత్‌ను తప్పించలేదు.. తప్పుకున్నాడు

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని తెలుగులో ప్రతి దర్శకుడూ కల కంటాడు. ఆ కల నెరవేర్చుకునేది కొందరే. రన్ రాజా రన్, సాహో చిత్రాల దర్శకుడు సుజీత్‌కు అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది. కానీ అంతలోనే చేజారింది. ‘సాహో’ తర్వాత రామ్ చరణ్‌తో ఓ సినిమా చేసేందుకు అతను ప్రయత్నిస్తే.. చిరు తనయుడు ‘లూసిఫర్’ రీమేక్‌ కోసం అతణ్ని లైన్లో పెట్టేశాడు. కొన్ని నెలల పాటు చిరు కోసం ‘లూసిఫర్’ను వర్కవుట్ చేసే ప్రయత్నం చేశాడు సుజీత్. కానీ అతడి పనితనం నచ్చక చిరు పక్కన పెట్టినట్లు.. అతడి స్థానంలోకి వి.వి.వినాయక్ వచ్చినట్లు వార్తలొచ్చాయి. ఈ విషయంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిరు స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఐతే సుజీత్‌ను తాము తప్పించలేదని.. అతనే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడని చిరు చెప్పడం విశేషం.

ఈ మధ్యే సుజీత్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఐతే పెళ్లి తర్వాత తాను ‘లూసిఫర్’ రీమేక్ స్క్రిప్టు మీద సరిగా దృష్టి పెట్టలేకపోతున్నాడని.. తాను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటానని సుజీత్ అడిగాడని.. అందుకు తాను సరే అన్నానని చిరు తెలిపాడు. ప్రస్తుతం వి.వి.వినాయక్ ‘లూసిఫర్’ స్క్రిప్టు పనులను పర్యవేక్షిస్తున్నాడని.. అతనే ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తాడని చిరు తెలిపాడు. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాలం’ రీమేక్‌లోనూ తాను నటిస్తున్నట్లు ధ్రువీకరించాడు చిరు. ఐతే సుజీత్ విషయంలో చిరు చెబుతున్నది ఎంత వరకు నిజమన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే సుజీత్ పెళ్లి చేసుకోవడానికి ముందే అతను ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. పైగా పెళ్లిని కారణంగా చూపించి సుజీత్ మెగాస్టార్‌తో సినిమా చేసే అవకాశాన్ని వదులుకుంటాడని అనుకోలేం. కాబట్టి ‘లూసిఫర్’ను ఒక సగటు మాస్ మసాలా సినిమాలా మలచడానికి సుజీత్ సరిపోడని.. వినాయక్ లాంటి వాడే దానికి కరెక్ట్ అని చిరు అండ్ కో భావించి ఉండొచ్చు. అయినా క్రియేటివ్‌గా ఆలోచించే ఈ తరం యువ దర్శకుడైనా సుజీత్ లాంటి వాడు.. ఒక రొటీన్ మాస్ మూవీని రీమేక్ చేయకపోవడమే మంచిదేమో.