ఇంకో ‘రంగమార్తాండ’నా.. వద్దు స్వామీ

టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్లలో ఒకడైన కృష్ణవంశీ ఒకప్పుడు ఎంత గొప్ప సినిమాలు తీశాడో.. అందుకు తగ్గట్లే ఎంత కాన్ఫిడెంట్‌గా, అగ్రెసివ్‌గా మాట్లాడేవాడో ఆయన అభిమానులకు గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. కృష్ణవంశీ తన స్థాయికి తగ్గ సినిమాలు తీసి చాలా కాలమైంది. అదే సమయంలో ఆయన మాట తీరు కూడా బాగా మారిపోయింది.

సోషల్ మీడియాలో అభిమానులతో తీరిగ్గా ముచ్చట్లు పెడుతూ.. తన గురించి ఎవరు ఏ కామెంట్ చేసినా ఓపిగ్గా స్పందిస్తున్నారు. ప్రశ్నలు వేసినా సమాధానాలు ఇస్తున్నారు. ఎక్కడా ఒక్క మాట తూలట్లేదు. అనామకులను కూడా గౌరవిస్తూ వినమ్రంగా సమాధానం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తన పాత, కొత్త చిత్రాల గురించి అనేక విశేషాలు.. తన అభిప్రాయాలు కూడా పంచుకుంటున్నారు కృష్ణవంశీ.

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘రంగమార్తాండ’ సినిమాను కొనియాడుతూ.. అలాంటి సినిమాలు చాలా అవసరమని.. కొంతమందిలో అయినా మార్పు తెస్తాయని.. ‘రంగమార్తాండ’ లాంటి సినిమా ఇంకోటి తీయాలని కృష్ణవంశీని కోరాడు. దానికి కృష్ణవంశీ బదులిస్తూ.. “అది పెద్ద ఫ్లాప్ సార్. థియేటర్లలో ఎవ్వరూ చూడలేదు. నాకు, నిర్మాతలకు పెద్ద లాస్. మళ్లీనా.. వొద్దు స్వామీ” అంటూ దండం పెట్టేశాడు.

మరాఠీ క్లాసిక్ ‘నట సామ్రాట్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సుదీర్ఘ కాలం మేకింగ్ దశలోనే ఉండి.. రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడి గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి సినిమా అని పేరొచ్చినా థియేటర్లకు జనం రాలేదు. దీంతో థియేటర్ల నుంచి రెవెన్యూ అంటూ ఏమీ రాలేదు. ఈ సినిమాను బయటికి తీసుకురావడానికి కృష్ణవంశీ కూడా డబ్బులు పెట్టినట్లు వార్తలొచ్చాయి. అందుకే తనకు, నిర్మాతలు ఇద్దరికీ పెద్ద లాస్ అని చెప్పుకుని కృష్ణవంశీ అలాంటి సినిమా ఇంకోటి తీయలేనని తేల్చేశాడు.