ప్రీమియర్లతో మిస్టర్ బచ్చన్ తెలివైన ఎత్తుగడ

ఊహించినట్టే మిస్టర్ బచ్చన్ విడుదల తేదీ ఆగస్ట్ 15 లాక్ చేస్తూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ లీక్ గత వారం రోజులకు పైగానే చక్కర్లు కొడుతున్నప్పటికీ ప్రొడక్షన్ హౌస్ నుంచి కన్ఫర్మేషన్ లేకపోవడంతో అభిమానులు ఎదురు చూస్తూ వచ్చారు. పాట చిత్రీకరణ జరుగుతూ ఉండగానే ఈ అనౌన్స్ మెంట్ రావడం గమనార్హం. అసలు విశేషం ఇది కాదు. ఆగస్ట్ 14 సాయంత్రమే పెయిడ్ ప్రీమియర్లు వేసేందుకు నిర్ణయం తీసుకోవడం. మాములుగా రవితేజ సినిమాలకు ఇలా వేయడం చాలా అరుదు. గత కొన్నేళ్లలో ఎప్పుడూ జరగలేదు. ఇదే మొదటిసారని చెప్పాలి.

ఇలా చేయడం వెనుక తెలివైన స్ట్రాటజీ కనిపిస్తోంది. ఆగస్ట్ 15 విపరీతమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా డబుల్ ఇస్మార్ట్ మూవీ మాస్ ఆడియన్స్ ని బలంగా టార్గెట్ చేసుకుంటోంది. ముందు రోజే మిస్టర్ బచ్చన్ షోలు వేయడం వల్ల తెల్లవారేలోపు టాక్ సులభంగా వెళ్ళిపోతుంది. ఇందులో రిస్క్ ఉన్నప్పటికీ కంటెంట్ మీద నిర్మాతలు మాములు నమ్మకంగా లేరు. రైడ్ రీమేక్ అయినప్పటికీ దర్శకుడు హరీష్ శంకర్ ఒరిజనల్ తో పోల్చి చూసినా ఇదే బాగుందనే రేంజ్ లో అలరిస్తానని హామీ ఇస్తున్నాడు. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ కి బాగా రీచ్ అవుతోంది.

సో మిస్టర్ బచ్చన్ రాకతో ఇండిపెండెన్స్ డే బాక్సాఫిస్ హాట్ గా మారిపోయింది. విక్రమ్ తంగలాన్, ఆయ్, 35 చిన్న కథ కాదులతో పోటీ రసవత్తరంగా మారుతోంది. మొత్తం అయిదు సినిమాలల్లో నాలుగు టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ కావడం విశేషం. మరి థియేటర్ల సర్దుబాటు ఎలా చేస్తారో వేచి చూడాలి. ఇంత కాంపిటీషన్ గత కొన్ని వారాల్లో ఎప్పుడూ చూడలేదు. పుష్ప 2 ది రూల్ ఈ డేట్ వదులుకోవడం ఆలస్యం ఒక్కసారిగా అందరూ స్వాతంత్ర దినోత్సవం మీద పడ్డారు. ఏదైతేనేం సుదీర్ఘమైన వీకెండ్ లో సినీ ప్రియులకు షడ్రసోపేతమైన చిత్రాల విందు కనివిందు చేయబోతోంది.