నాగశౌర్యకు ఉన్న గొడవలు చాలవని..

యువ కథానాయకుడు నాగశౌర్య కెరీర్ ఇప్పుడు ఏమంత బాగా లేదు. అతను నిఖార్సయిన హిట్ కొట్టి చాలా కాలమైంది. చివరగా ‘రంగబలి’ అనే డిజాస్టర్ మూవీతో పలకరించాడు శౌర్య. ఆ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాక మీడియాతో మాట్లాటే సమయంలో తన తీరు కొంత వివాదాస్పదమైంది. ఆ తర్వాత అతను కనిపించలేదు.

వరుసగా సినిమాలు ఫెయిలవుతుండడంతో కొత్త చిత్రం మొదలుపెట్టడానికి చాలా టైం తీసుకున్నాడు. ఈలోపు హత్య కేసులో చిక్కుకున్న కన్నడ నటుడు దర్శన్‌కు మద్దతుగా పెట్టిన పోస్టు తీవ్ర దుమారం రేపింది. అలాంటి వాడికి మద్దతేంటి అంటూ అతణ్ని నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు నాగశౌర్య కొత్త సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలోనే కాక ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

కొత్త సినిమా విషయంలో రకరకాల ఆప్షన్లు పరిశీలించి చివరికి అరుణాచలం అనే కొత్త దర్శకుడితో ఓ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లాడు శౌర్య. ఐతే ఈ సినిమా షూట్ రెండు వారాలు తిరక్కముందే ఆపేశారట.

ఓ ఎన్నారై నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రాగా.. కొత్త వ్యక్తి కావడంతో దర్శకుడు మిగతా టీం షూటింగ్ మొదలవడానికి ముందే కథా చర్చలు, ప్రి ప్రొడక్షన్ పేరుతో బాగా ఖర్చు పెట్టించేశారట. షూటింగ్ మొదలయ్యాక కూడా ఖర్చు తడిసి మోపెడవుతోందట. అప్పుడే బడ్జెట్ రూ.10 కోట్లు దాటిపోవడంతో నిర్మాత కంగారెత్తిపోతున్నాడట.

నాగశౌర్య మార్కెట్ బాగా దెబ్బ తినేసి ఉండగా.. ఈ టైంలో పది పన్నెండు రోజుల షూట్‌కే పది కోట్లకు పైగా బడ్జెట్ అయిపోతే చివరికి ఎంత బడ్జెట్ అవుతుందో అంచనా వేసుకుని నిర్మాత భయపడి సినిమాను ఆపేశాడట. ఈ సినిమా తాను చేయనని.. అయిన ఖర్చు తనకు సెటిల్ చేసి వేరే నిర్మాతను చూసుకోవాలని కోరుతున్నాడట. అతను ఫిలిం ఛాంబర్ పెద్దలను ఆశ్రయిస్తున్నాడట. మరి ఈ గొడవ మధ్య ఆ సినిమా ఏమవుతుందో చూడాలి.