తొందర వద్దంటున్న మహేష్ రాజమౌళి

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్ట్ 9న రాజమౌళి సినిమా తాలూకు అధికారిక ప్రకటన ఉంటుందని ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించేలా ఆ రోజు ఎలాంటి అప్డేట్ ఉండదని అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని విషయాలు తెలిశాయి. ప్రస్తుతం జక్కన్న వర్క్ షాప్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కు సంబంధించిన గ్రీన్ మ్యాట్ వర్క్స్ తో పాటు, అవుట్ డోర్ లో తీయాల్సిన ఎపిసోడ్స్ గురించి స్టంట్ మాస్టర్స్, రైటర్స్, ముఖ్యమైన టెక్నీషియన్స్ తో కలిసి చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.

హీరో బర్త్ డే కాబట్టి మంచి అకేషనే అనుకున్నా అసలు షూటింగే ఎప్పుడు మొదలుపెట్టాలో ఇంకా స్పష్టత లేనప్పుడు తొందరపడటం దేనికని భావించారట. దానికి మహేష్ మద్దతు తెలుపడంతో కేవలం మురారి రీ రిలీజ్ తోనే ఫ్యాన్స్ సరి పెట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని ముందే గుర్తించి ఆ సినిమా తాలూకు వీడియోలు పాటలతో క్లిప్పులతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడం మొదలుపెట్టారు. గుంటూరు కారం తర్వాత మళ్ళీ మహేష్ ని తెరమీద చూసేందుకు రెండు మూడేళ్లు ఎదురు చూసే పరిస్థితి ఉండటంతో ప్రతి రీ రిలీజ్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించి ఇంకా క్యాస్టింగ్ కూడా ఒక కొలిక్కి రాలేదట. రాజమౌళి అడిగితే ఎవరూ కాదనరు కానీ డేట్ల విషయంలో సరైన ప్లానింగ్ తో లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ముందు ఆర్టిస్టులను లిస్ట్ అవుట్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళ అందుబాటుని చెక్ చేసుకోబోతున్నారు. పృథ్విరాజ్ సుకుమారన్ గురించి వచ్చిన వార్త ఆ లీకుల్లో భాగమే. అడవి నేపథ్యంలో జరిగే స్టోరీనే అయినప్పటికీ ఈసారి రాజమౌళి ఫాంటసీ టచ్ ఇవ్వబోతున్నారని తెలిసింది. అదెలా ఉండబోతోందనేది అంత సులభంగా బయట పడేది కాదు కానీ బోలెడు సమయముందిగా వెయిట్ చేద్దాం.