50 వార్షికోత్సవ వేళ వైజయంతి ప్లాన్ ఏంటి

కల్కి 2898 ఏడి విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్న వైజయంతి మూవీస్ బ్యానర్ స్థాపన ఈ సంవత్సరంతో యాభై సంవత్సరాల మైలురాయి చేరుకుంది. అన్న ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభమై ఎదురులేని మనిషి లాంటి భారీ చిత్రంతో తెరంగేట్రం చేసి ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగడం ఒక చరిత్ర. తొలి చిత్రం విడుదలైంది 1975లో అయినప్పటికీ సంస్థ మొదలుపెట్టింది మాత్రం 1974లో కనక ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకునే దిశగా నిర్మాత అశ్వినీదత్ ఏమైనా ప్లాన్ చేస్తారేమో అని అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఒక చోట భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తారట. ఎప్పటి నుంచో మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్న ఇంద్రతో పాటు మహేష్ బాబు డెబ్యూ రాజకుమారుడుని భారీ ఎత్తున రీ రిలీజ్ చేసే ప్రతిపాదన సీరియస్ గా పరిశీలనలో ఉన్నట్టుగా తెలిసింది. వైజయంతి 50 ఈవెంట్ ఈ ఏడాది చేయాలా లేక వచ్చే సంవత్సరం నిర్వహించాలా అనే దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. కల్కి 2ని అధికారికంగా ప్రకటించే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. ఎప్పుడనేది డిసైడ్ అవ్వాలి.

వైజయంతిని స్వప్న, ప్రియాంకలతో పాటు నాగ్ అశ్విన్ నడిపిస్తున్న తీరు లెజెండరీ సంస్థ మనుగడకు గ్యారెంటీ ఇచ్చేసింది. దాన్ని నిలబెట్టే దిశగా వాళ్ళు చేస్తున్న ఆలోచనలు, మహానటి లాంటి సినిమాలు తీసే సాహసాలు అద్భుత ఫలితాన్ని ఇస్తున్నాయి. ట్రెండ్ పేరుతో ఫ్యామిలీ ఆడియన్స్ దూరమయ్యే ఎలాంట కంటెంట్ జోలికి వెళ్లకుండా వందల కోట్లు ఖర్చు పెడుతున్నా సరే క్లీన్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చే సిద్ధాంతాన్ని వదిలిపెట్టడం లేదు. శ్రీమతి కుమార్ లాంటి వెబ్ సిరీస్ లతో డిజిటల్ స్పేస్ లోనూ ముద్ర వేసేశారు. త్వరలోనే క్రేజీ ప్రాజెక్టులు చాలానే అనౌన్స్ కాబోతున్నాయి.