బచ్చల మల్లికి వివాదంతో స్వాగతం

అల్లరి నరేష్ టైటిల్ రోల్ పోషించి సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న బచ్చల మల్లి టీజర్ హీరో పుట్టినరోజు సందర్భంగా నిన్న రిలీజైన సంగతి తెలిసిందే. లుక్స్ పరంగా పుష్పలో అల్లు అర్జున్ కు దగ్గరగా ఉందనే కామెంట్స్ జనంలో వినిపిస్తున్నప్పటికీ కథ, పెర్ఫార్మన్స్ పరంగా రెండింటికి ఏ మాత్రం సంబంధం ఉండదని మేకర్స్ అంటున్నారు. ఇప్పటిదాకా కమెడియన్, సపోర్టింగ్ హీరోగా పలు రకాల పాత్రల్లో చూసిన అల్లరోడిని పూర్తిగా వేరే కోణంలో చూపించామని హామీ ఇస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ చిన్నగా బచ్చల మల్లి చుట్టూ వివాదం రేగే సూచనలు కనిపిస్తున్నాయి.

టీజర్ వీడియో ప్రారంభంలో చూపించిన మైక్ సెట్ లో పుట్టినవానికి మరణం తప్పదంటూ భగవద్గీత సూక్తి వినిపించే షాట్ ఒకటి పెట్టారు. అది విన్న మల్లి బయటికి వచ్చి స్థంభం మీద కట్టేసిన స్పీకర్ ని పీకి నేలకేసి విసిరి కొడతాడు. దీంతో సౌండ్ ఆగిపోతుంది. అయితే దీని పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హిందువులు పవిత్రంగా భావించే ప్రవచనాన్ని ఇలా అవమానించడం సరికాదని, ఇదే ఇతర మతాలకు సంబంధించిన వాటిని పెడతారా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. వీలైనంత త్వరగా దాన్ని మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రస్తుతానికి ఈ రగడ ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి చల్లారిపోతుందా లేక క్రమంగా రాజుకుంటుందా అనేది వేచి చూడాలి. బచ్చల మల్లి సక్సెస్ అల్లరి నరేష్ కు చాలా కీలకం. తిరిగి హాస్యం ట్రై చేద్దామని ఆ ఒక్కటి అడక్కు చేస్తే అది కాస్తా తీవ్రంగా నిరాశ పరిచింది. అందుకే మళ్ళీ సీరియస్ రోల్స్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ లో చేయబోయే సినిమా కూడా విభిన్నంగానే ఉంటుందట. బచ్చల మల్లికి పుష్ప పోలిక, మైకు కాంట్రావర్సీ చూస్తుంటే ఇప్పటి ట్రెండ్ ప్రకారం పబ్లిసిటీగా ఉపయోగించుకుని ముందుకు వెళ్లిపోవడమే తక్షణ కర్తవ్యం.