థియేటర్లు కళకళలాడటం చూసి ఎన్ని రోజులయ్యిందో

నిన్నటి దాకా తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లు కనీస అద్దెలు కిట్టుబాటు కాక అలో లక్ష్మణా అంటున్న పరిస్థితి. మహారాజ లాంటి హిట్ సినిమా ఆడుతున్న హాళ్లు తప్పించి మిగిలిన వాటికి నిర్వహణ ఖర్చులు కూడా రాక లబోదిబోమన్నాయి. హరోంహర, మనమేలు డీసెంట్ గా లాక్కురాగా గత వారం మరీ అన్యాయంగా ఒక్కటంటే ఒక్కటి నోటెడ్ రిలీజ్ లేకపోవడం మరింత దారుణమైన స్థితికి తీసుకెళ్లింది. ఒక్క రోజులో సీన్ మొత్తం రివర్స్. ఏపీ తెలంగాణలో సింగల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా ఉదయం నాలుగు గంటల నుంచే ప్రభాస్ అభిమానులు కల్కి 2898 ఏడి బెనిఫిట్ షోల కోసం బారులు తీరారు.

జనవరి తర్వాత మళ్ళీ ఇప్పుడు పహారా కోసం తమను థియేటర్ యజమానులు పిలిచారని పోలీసులు చెబుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ట్రెండ్ ఎలా ఉంటుందో ముందే అవగాహన వచ్చేసింది దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేసుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. కాసిన్ని సమోసాలు, కూల్ డ్రింక్స్ అమ్ముడుపోవడమే గగమమవుతున్న టైం నుంచి ఇవాళ స్నాక్స్ మొత్తం సోల్డ్ అవుట్ అవ్వడం ఖాయమనే ధీమా ఇవ్వడం దాకా వచ్చింది. ప్రభాస్ మానియా ప్రతి చోటా కనిపిస్తోంది. దానికి తోడు పబ్లిక్ టాక్, రివ్యూలు అధిక శాతం పాజిటివ్ గా ఉండటంతో టికెట్లు బుక్ చేసుకునేందుకు ఆడియన్స్ పోటీ పడుతున్నారు.

సగటున గంటకు 60 వేలకు పైగా టికెట్లు బుక్ మై షోలో అమ్ముడుపోతున్నాయి. పేటిఎం లెక్కలు వేరే. డైరెక్ట్ గా కౌంటర్ లో జరిగే అమ్మకాల ఫిగర్స్ రేపు బయటికి వస్తాయి. పార్కింగ్ స్టాండ్లు బైకులు, కార్లతో నిండిపోవడం షాపింగ్ మాల్స్ సిబ్బందికి ఎక్కువ పనిని కలిగిస్తోంది. ఈ రోజు నుంచి ఆదివారం దాకా డబుల్ షిఫ్ట్స్ లో పని చేయాలని మల్టీప్లెక్సుల సిబ్బందికి మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారని తెలిసింది. ఇన్సెంటివ్ ఎక్కువ ఇవ్వడం ద్వారా వాళ్లకూ ఇది ప్రయోజనమే. మొత్తానికి నాలుగుగైదు నెలల తర్వాత థియేటర్ల దగ్గర సందడి వాతావరణం చూస్తుంటే మూవీ లవర్స్ ఆనందం అంతా ఇంతా కాదు.