‘నిశ్శబ్దం’ అలా అనుకుంటే.. ఇలా అయింది

థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూసి, చూసి చివరికి ఓటీటీ విడుదలకు సిద్ధమైపోయిన సినిమా ‘నిశ్శబ్దం’. అక్టోబరు 2న ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన అనుష్కతో పాటు తమిళ విలక్షణ నటుడు మాధవన్, హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించడం విశేషం.

ఇంతకుముందు మంచు విష్ణుతో ‘వస్తాడు నా రాజు’ లాంటి ఫ్లాప్ మూవీ తీసిన హేమంత్ మధుకర్.. ఇంతి పెద్ద కాస్ట్‌తో, పెద్ద బడ్జెట్లో ఇలాంటి సినిమా తీయడం విశేషమే. ఐతే ముందు అయితే అతను ‘నిశ్శబ్దం’ తీయాలనుకున్నది అనుష్కతో కాదట. దాని బడ్జెట్ కూడా తక్కువట. పైగా దీన్ని మూకీ మూవీగా తీయాలన్నది అతడి ఆలోచనట. ఐతే తర్వాత అన్నీ మారిపోయినట్లు అతను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘వస్తాడు నా రాజు’ తర్వాత తాను, మణిశర్మ నిర్మాతలుగా మారి తన దర్శకత్వంలో హిందీలో ‘ముంబయి 125’ అనే త్రీడీ మూవీ తీశామని.. ఐతే అది ఏమాత్రం ఆడకపోవడంతో డబ్బులన్నీ పోయాయని.. ఆపై తాను ఏదైనా వెరైటీ సినిమా చేద్దామన్న ఆలోచనతో ‘నిశ్శబ్దం’ కథ రాసుకుని ముందుగా మాధవన్‌కు వినిపించానని.. ఆయన చాలా బాగుందని అన్నారని.. తాప్సిని హీరోయిన్ పాత్రకు అనుకున్నామని.. పీవీపీ, నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారని.. అప్పటికి అది మూకీ మూవీగానే అనుకున్నామని హేమంత్ తెలిపాడు.

ఐతే ఒకసారి అనుకోకుండా కోన వెంకట్‌ను కలిసినపుడు కథ చెబితే.. ఇది చాలా బాగుందని.. దీన్ని పెద్ద స్థాయిలో, ఇంటర్నేషనల్ లెవెల్లో చేద్దామని చెప్పాడని.. తర్వాత అనుష్కకు ఆయనే కథ చెప్పి ఒప్పించారని.. తర్వాత గోపీ మోహన్‌తో కలిసి అమెరికా బ్యాక్‌డ్రాప్‌తో కథను మార్చానని హేమంత్ వెల్లడించాడు. మూకీగా చేస్తే కమర్షియల్‌గా అనుకున్నంత స్థాయికి సినిమా వెళ్లదని, నిర్మాతల శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకుని టాకీగానే చేయాలని తర్వాత అనుకున్నామని.. అప్పుడు కోన వెంకట్ కూర్చుని ఈ కథకు మాటలు రాశాడని.. అలా ఈ సినిమా స్వరూపం మారిపోయిందని హేమంత్ వెల్లడించాడు.