పుష్పతో పోలికా…వాటే జోక్ అబ్రహం

ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ మీద అంచనాలు అంతకంతా పెరగడమే తప్ప తగ్గే సూచనలు ఎంత మాత్రం లేవు. ప్యాన్ ఇండియా స్థాయిలో హక్కుల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా బాలీవుడ్ బయ్యర్లు ఎగబడేందుకు సిద్ధంగా ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఇంకా ఏ డీల్ క్లోజ్ చేయలేదు. ట్రైలర్ వదిలాక బేరాలు ఫైనల్ చేయాలని ఫిక్సైనట్టు సమాచారం. ఇంత హైప్ ఉన్నా పుష్ప 2కి పోటీ లేదని కాదు. కన్నడలో శివరాజ్ కుమార్ భైరతి రణగల్, తమిళంలో కీర్తి సురేష్ రఘు తాతలు బరిలో ఉన్నాయి. వాయిదా పడే సూచనలు పూర్తిగా కొట్టిపారేయలేం.

తాజాగా జాన్ అబ్రహం బాలీవుడ్ మూవీ వేదా ఆగస్ట్ 15 రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇలా పోస్టర్ రావడం ఆలస్యం ముంబై మీడియా ఏకంగా పుష్ప వర్సెస్ వేదా అంటూ కథనాలు అల్లేస్తున్నాయి. నిజానికి జాన్ అబ్రహం ఇటు షారుఖ్ ఖాన్ రేంజ్ స్టార్ కాదు, అటు అజయ్ దేవగన్ తరహాలో టైర్ టూ హీరో కాదు. అవసరమైనప్పుడు పఠాన్ లాంటి వాటిలో విలన్ వేషాలు వేసేందుకు కూడా వెనుకాడని టైపు. అలాంటిది ఏకంగా అల్లు అర్జున్ తో పోటీ అని సమాంతరం హెడ్డింగులు పెట్టడం కామెడీగా ఉందని బన్నీ ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు.

ఇంతకన్నా ముందు సింగం అగైన్ ని ఇండిపెండెన్స్ డేకి తీసుకురావాలని దర్శకుడు రోహిత్ శెట్టి ప్లాన్ చేసుకున్నాడు. దానికి అనుగుణంగానే షూటింగ్ జరిగేది. కానీ ఎప్పుడైతే పుష్ప 2 అనౌన్స్ మెంట్ వచ్చిందో ఒక్కసారిగా నెమ్మదించి తన సినిమాను వాయిదా వేయించాడు. క్రేజ్ ఉన్న సౌత్ ఇండియా మూవీతో తలపెడితే ఎలా ఉంటుందో కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్, కాంతారలు వచ్చినప్పుడు హిందీ నిర్మాతలకు అర్థమయ్యింది. అందుకే పుష్ప 2కి దూరంగా ఉన్నారు. కానీ వేదా మాత్రం రిస్క్ చేస్తోంది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా ముఖ్యమైన క్యారెక్టర్ చేసింది.