చందూ మొండేటి ‘కార్తికేయ-2’ను పక్కన పెట్టి..

‘కార్తికేయ’ సినిమాతో టాలీవుడ్లోకి దర్శకుడిగా సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చాడు చందూ మొండేటి. రెండో సినిమా ‘ప్రేమమ్’ రీమేక్‌తోనూ మెప్పించిన అతను.. మూడో ప్రయత్నంగా తీసిన ‘సవ్యసాచి’తో మాత్రం నిరాశ పరిచాడు.

మంచి అంచనాల మధ్య వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. చందూ కూడా డీలా పడిపోయాడు. కొంచెం గ్యాప్ తీసుకుని అతను ‘కార్తికేయ’ సీక్వెల్‌తో సత్తా చాటాలని నిర్ణయించుకున్నాడు. నిఖిల్ హీరోగా ఈ సినిమాకు రంగం సిద్ధం చేశాడు కూడా.

ఈ ఏడాది వేసవిలో ఆ చిత్రం సెట్స్ మీదికి వెళ్లాల్సింది. కరోనా-లాక్ డౌన్ వల్ల ఆలస్యమైంది. షూటింగ్స్ పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇక ఆ చిత్రం కూడా పట్టాలెక్కుతుందనే అంతా అనుకున్నారు. కానీ చందూ ఆశ్చర్యకరంగా ఆ సినిమాను పక్కన పెట్టాడు.

‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘చిత్రలహరి’ లాంటి సినిమాల్లో కథానాయికగా ఆకట్టుకుని.. ‘అల వైకుంఠపురములో’లో ప్రత్యేక పాత్రలో మెరిసిన నివేథా థామస్ ప్రధాన పాత్రలో చందూ మొండేటి ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీని మొదలుపెట్టడం విశేషం.

ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అట. తక్కువమంది కాస్ట్ అండ్ క్రూతో తక్కువ రోజుల్లో ఈ సినిమా పూర్తి చేయడానికి చందూ ప్రణాళికలు రచించుకుని రంగంలోకి దిగాడు. ‘కార్తికేయ-2’ భారీతనం నిండిన కథ. వేర్వేరు లొకేషన్లలో షూట్ చేయాల్సి ఉంది. కేరళకు కూడా వెళ్లాల్సి ఉంది.

ఐతే అన్ని చోట్లా అనుమతులు రావడానికి, షరతుల్లేకుండా షూటింగ్ చేయడానికి సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో చందూ గ్యాప్‌ను ఉపయోగించుకుంటూ ఓ చిన్న సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. రెండు నెలల్లోనే ఈ సినిమాను అతను పూర్తి చేసేయబోతున్నట్లు సమాచారం. ఏడాది చివరికి ‘కార్తికేయ-2’ను మొదలుపెట్టే ప్రణాళికల్లో అతనున్నాడు.